ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయిన సంగతి తెలిసిందే. శనివారం అమరావతిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు, అధికారులు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణం చేసిన మంత్రులు... వరుసగా సీఎం వైఎస్ జగన్, గవర్నర్ నరసింహన్కు కృతజ్ఞతలు తెలిపారు. అమాత్యులుగా బాధ్యతలు స్వీకరించిన నేతలు కేబినెట్లో తమ చాంబర్ల ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. దీంతో సచివాలయం సందడి నెలకొంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీమ్ 25 ప్రమాణస్వీకారం పూర్తయిన నేపథ్యంలో...సచివాలయంలో మంత్రులకు ఛాంబర్ల ఏర్పాటుపై సాధారణ పరిపాలన శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు మంత్రులు ఛాంబర్లను పరిశీలించి వెళ్తున్నారు. రెండో బ్లాకులో మున్సిపల్ శాఖ మంత్రి పేషీని మంత్రి బొత్స,ఆయన సతీమణి పరిశీలించారు. మున్సిపల్ శాఖ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించిన బొత్స పేషీకి అవసరమైన మార్పులు చేర్పులపై సూచనలు చేశారు. ఇక దేవాదాయ శాఖ,విద్యా శాఖ మంత్రుల పేషీలని పరిశీలించిన వెల్లంపల్లి అనుచరులు ఈ మేరకు అందులో ఒకటి ఖరారు చేశారు. అనుచరుల సూచన మేరకు విద్యా శాఖ పేషీ ప్రాంగణం తీసుకోవాలనే ఆలోచనలో వెలంపల్లి ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా మిగతా మంత్రులు సైతం తమ పేషీల కోసం సోమ, మంగళవారాల్లో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయం మొదటి బ్లాక్లో సీఎం చాంబర్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు వేద పండితులు. అనంతరం తన ఛాంబర్లో తొలి సంతకం చేసి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వైఎస్ జగన్ స్వీకరించారు. ఈ వారంలోనే సీఎం జగన్ లే కొందరు మంత్రులు తమ చాంబర్లలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.