ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులను ఓ వైపు ఖరారు చేస్తూ ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మరో వైపు పార్టీ ముఖ్యుల రూపంలో షాక్ తగులుతోంది. కీలక నేతలు పార్టీకి గుడ్భై చెప్తూ కలవరపాటుకు గురిచేస్తుండగా, తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం ఇదే దారిలో నడిచారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపులు సుబ్బారావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. కార్యకర్తల సమావేశంలో టీడీపీ చేసిన అన్యాయాన్ని చెబుతూ కంటతడి పెట్టుకున్న వరుపుల ఈ సందర్భంగా తన నిర్ణయం ప్రకటించారు.
కొంత కాలంగా తనపట్ల తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు అస్సలు బాగాలేదని..ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం ఇష్టం లేదని.. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు సుబ్బారావు గురువారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన తనకు జరిగిన పరాభవాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో చేరాలని వరుపులను కార్యకర్తలు ఒత్తిడి చేశారు. అయితే, వరుపులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇదిలాఉండగా, మరో వైపు ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కుటుంబం కూడా టీడీపీకి గుడ్ బై చెప్పింది. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం పార్టీని వీడుతుండటంతో, రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఓటములు తీవ్రంగా ప్రభావితం కానున్నాయని అంచనా వేస్తున్నారు.