ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మరో మూడు మాసాల్లోనే ఎన్నికలు జరగనున్న ఏపీలో అధికార టీడీపీ కేంద్రంగా రాజకీయాలు ఊపందుకున్నా యి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఏకైక విపక్షం వైసీపీ తన వ్యూహాలను అమలు చేస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయి న వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పీఠం ఎక్కేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణా అధికార పార్టీ టీఆర్ ఎస్ సాయం అందుకుంటున్నట్టుగా అనేక వార్తలు వస్తున్నాయి. తెలంగాణా సారధి కేసీఆర్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న రాజకీయ వైరాన్ని తీర్చుకునేందుకు జగన్కు పరోక్షంగా సాయం చేస్తామని గతంలోనే వెల్లడించారు. అదేసమయంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కనుక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే.. అది ఎలా ఉంటుందనే ప్రశ్నలకు భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో తొలి అడుగా అన్నట్టుగా .. వైసీపీ అధినేత జగన్తో టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడం చర్చకు దారితీసింది. పైకి మాత్రం ఫెడర్ ఫ్రంట్ కోసమే తాము చర్చించినట్టు చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం ఈ ఇద్దరు నాయకులు.. ఏపీ రాజకీయాలపై చర్చించారని తెలుస్తోంది. అయితే, దీనికి కొనసాగింపుగా కేసీఆర్ కూడా జగన్ తో ఈ నెల ఆఖరులో భేటీ అవుతారని, అప్పుడు సవివరంగా చర్చిస్తారని కేటీఆర్, జగన్లు చెప్పారు. కట్ చేస్తే.. ఈ భేటీపై అధికార టీడీపీ అప్పుడే పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. ఏపీకి ద్రోహం చేసిన కేసీఆర్తో జగన్ కలుస్తుంటే.. ప్రజలు హర్షించరని, ఇక్కడ ప్రజలు బుద్ధి చెబుతారని నాయకులు పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. ఏపీకి గతంలోను, ఇప్పుడు కేసీఆర్ చేసిన అన్యాయం, మాట్లాడిన వైనంపై అనేక ఉదాహరణలు కూడా వల్లించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
ఏపీకి అన్యాయం చేస్తున్న వాళ్లతో జగన్ ఎలా చేతులు కలుపుతాడని నిలదీస్తున్నారు. ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీ ఒక్కటయ్యారని ఆరోపించారు. వీళ్ల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమైందని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటా దక్కకుండా అడ్డుపడిన... సీఎం కేసీఆర్తో కలిసి జగన్ ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. అయితే, నిజంగా ఇప్పటి వరకు చెప్పాలంటే.. ఇది టీడీపీ వెర్షన్ మాత్రమే. ప్రజలు ఏమనుకుంటున్నారు? అనేది ఇప్పటి వరకు ఎక్కడా బహిర్గతం కాలేదు. ఇటీవల తెలంగాణాలో కేసీఆర్ విజయంసాధించినప్పుడు అనేక జిల్లాల్లో కొన్ని సామాజిక వర్గాల ప్రజలు రోడ్లమీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. అదేసమయంలో ఏపీ విభజననను వ్యతిరేకించిన వేడి ఇప్పుడు ఏపీలో లేదు.
నిజానికి విడిపోయినందుకే మనకు అమరావతి, పోలవరం, పరిశ్రమలు వంటివి వస్తున్నాయని నమ్ముతున్నవారు కూడా పెరిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ వెతికి పట్టుకునితెరమీదికి తెస్తున్న వాదనలు కానీ, విషయాలు కానీ పస ఉంటుందని భావించే పరిస్తితి కనిపించడం లేదు. నిజానికి ఒకే రాష్ట్రంగా ఉండి ఉంటే.. ఇప్పటికీ ఇన్ని అవకాశాలు వచ్చేవి కావని నమ్ముతున్న ప్రజలు ఏపీలో కనిపిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రజలు పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారనేది నిజం! అయితే, దీనికి సంబంధించి ముఖ్యంగా జగన్-కేసీఆర్ల బంధానికి సంబంధించి మరింత ప్రచారం పాజిటివ్గా జరిగితే దీనిపై ఫుల్ క్లారిటీ వస్తుందని అంటున్నారు. సో.. కొంత కాలం వెయిట్ చేయకతప్పదు!