పరువు పోగొట్టుకున్న చంద్రబాబు.. ఇంత అవమానమా..?
దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషయన్ను అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా పవన్ కల్యాణ్ విషయంలో స్పందించిన తీరు ఆయన స్థాయిని తగ్గించేలా ఉంది. ఏపీలో వైసీపీ, జనసేన రెండూ చంద్రబాబు సర్కారుపై తీవ్రమైన విమర్శల దాడి చేస్తున్నాయి. అలాంటి సమయంలో పవన్ కల్యాణ్ తనతో కలసి రావాలని కోరడం ద్వారా ఆయన పలుచన అయ్యారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఏపీలోనూ తేడా వస్తుందేమోనన్న భయం చంద్రబాబులో ఉండొచ్చు. దాన్ని కాదనలేం. రాజకీయాల్లో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు. కానీ ఆయన పొత్తు ప్రయత్నాలు లోపాయకారీగా కాకుండా నేరుగా బహిరంగ సభలో ప్రకటన చేయడం ద్వారా ఇబ్బందుల్లో పడ్డారు.
అవతల పార్టీ సానుకూలంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలతో ఇబ్బంది ఉండదు. చంద్రబాబు ప్రకటన చూసి జనం కూడా టీడీపీ, జనసేన కలవబోతున్నాయేమో అనుకున్నారు. సానుకూల సంకేతాలు లేకుండా చంద్రబాబు నుంచి ఇలాంటి డైలాగ్ ఎలా వస్తుందబ్బా అనుకున్నారు. కానీ చివరకు ఏమైంది.
తాను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని పవన్ కల్యాణ్ నేరుగా ప్రకటించేశారు. వామపక్షాలతో కలసి అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. సో.. చంద్రబాబు పవన్ను ఎంత బతిమాలుకున్నా ఫలితం దక్కలేదన్నమాట. మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. తెలుగుదేశం వంటి పెద్ద పార్టీ.. చివరకు పవన్ వంటి నాయకుడిని బతిమాలుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది.. ఇది దేనికి సంకేతం.. పరువును కూడా పణంగా పెట్టినా చంద్రబాబుకు ఫలితం దక్కకపోవడం ఆయన దీనస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.