చిరు - పవన్: అపూర్వ సహోదరుల రాజకీయ నటనం రసవత్తరం

సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నవరసనటనా సార్వభౌములే! చిరంజీవి పవన్ కళ్యాన్ అనబడే ఈ అపూర్వ సహోదరులు. అవకాశం కోసం గోతికాడ నక్కల్లా కాసుకు కూర్చోవటం రాజకీయనాయకుల లక్షణం. సందేహం లేదు. గతంలో ముందుగా ప్రజారాజ్యం అనే ఒక పార్టీని పెట్టారు. చిరంజీవి తాను కూడా నందమూరి తారక రామారావు లాగా నాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిని అయిపోదామని ఊహల్లో తేలిపోయాడు.


అయితే ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయ పరిస్థితులకూ చిరంజీవి కాలం నాటి పరిస్థితులకు హస్తి మశాంతకమంత తేడా ఉంది. చిరుకు నాడు ధారుణమైనఎదురుదెబ్బ తగిలింది. నిజంగా ప్రజాసేవ చేయాలని తపించే వారికి వారికి కొంత ఓపిక, మరి కొంత నిరీక్షణ చాలా అవసరం. ప్రతికూల పరిస్తితుల్లో కూడా ఆ పార్టీని అలాగే సజీవంగా ఉంచి ఉండాలి కొంత కష్ట నష్టాలైనా భరించి.

అధికారవ్యామోహం, పదవీదాహం అధికంగా ఉన్న చిరంజీవి అమాంతం ముఖ్యమంత్రి కావాలి అనే తపనతో ఉండేవాడు.  అందుకే ఏ మాత్రం నిరీక్షించే ఓపిక లేక ప్రజారాజ్యాన్ని పాప ఫంకిలమైన కాంగ్రెస్ అనే వైతరుణి లో కలిపేశాడు చిరంజీవి. అతి వేగంగా జెండా పీకేశారు. డెబ్బై లక్షల ఓటర్ల ఆశల ఊపిరి తీసేసి, వారి నమ్మకాలకు పంగనామాలు పెట్టి,  తమ ఎమ్మెల్యేలను తామెవరికైతే వ్యతిరేఖంగా తమ ప్రజారాజ్యాన్ని సృష్టించారో,  అదే కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేశాడు ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి.  అందుకు కాంగ్రెస్ నుండి ప్రతిఫలంగా తను  రాజ్యసభ సభ్యత్వాన్ని,  కేంద్రమంత్రి పదవిని కూడా పొంది, పరమ అవకాశవాది అత్యంత సిగ్గులేని దురాశాపరుడుగా అపకీర్తి తెచ్చుకున్నాడు. 

ప్రజలకు, ప్రజారాజ్యం ప్రజా ప్రతినిధులకు, అభిమానులకు ఈ సందర్భంగా  జరిగిన అవమానం శరాఘాతం మాత్రమే కాదు, రాజకీయ నాయకుడుగా చిరంజీవిని ఉభయ రాష్ట్రాల తెలుగు వారెవ్వరూ విశ్వసించరుగాక విశ్వసించరు. "థూ"  అంటూ నాడు ప్రజలంతా ముఖంమీద ఉమ్మేయకపోయినా మనసుల్లో అంతపనీ చేస్తారు.  ఐదారేళ్ల  కాలం గడిచింది కేంద్రమంత్రి పదవి, పార్లమెంట్ సభ్యత్వాన్ని సమూలంగా అనుభవించారు విషయలాలసపై ఇంకా తృప్తి కలగలేదు. కథ సశేషం. 2014లో మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభ కోల్పోయింది. చిరు కథ సమాప్తం అయిపోయింది. మళ్లీ తమ్ముడు పవన్ ఆద్వర్యంలో జనసేన కొత్తపార్టీ ఆవిర్భవించింది. గత ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీలకు ప్రచారం చేసి పెట్టాడు తమ్ముడు. 



నేడు జనసందోహమంతా వీళ్ళ వేషాలు చూసి నవ్వుకున్నారు.  కావలసినంత హాస్యం, వెటకారం జనం మాటామంతిలో వరద లై పారగా ఆ అన్నయ్య ఈ తమ్మయ్య కామెడీ చూసి తరిస్తూ మన ఖర్మ అనుకున్నారు. ఎన్నాళ్లు మోసం చేస్తారు? అని చర్చించుకుంటూ ఉన్నప్పుడు తన పార్టీతో తన అన్నకు ఎలాంటి సంబంధం లేదని తమ్ముడు పవన్ కల్యాణ్ నాటకీయంగా చిలచ పలుకులు సదాశయాలు వల్లించాడు. 



ఇక ఇప్పుడేమో సొంతంగా ముఖ్యమంత్రి కావాలనే తపనతో తలక్రిందులౌతూ, జనసేన పార్టీకి జవసత్వాలు కలిగిస్తూ తన సినీ అభిమాన వంది మాగద గణాలను, కొందరు స్వకుల జన పంచమాంగ దళాలను వెంటేసుకొని సత్తా చూపిస్తా! అంటున్నాడు. 
పవన్ జనసేన రాజకీయాలకు జవ(న)సత్వాలు యివ్వటానికే చిరు అభిమానులు కదులుతున్నారు 
ఇక మొన్నటివరకూ తనపార్టీకీ అన్నకు సంబంధంలేదని చెప్పుకున్న, తమ్ముడు నేడు ప్లేట్ ఫిరాయించి పక్కా రాటు తేలిన రాజకీయనాయకుడులా అన్న అభిమాను లే తన పార్టీకి ఆయువుపట్టు శ్రీరామరక్ష అంటున్నాడు. అహా!  ఎంత అద్భుత నటన. నాటి నటసార్వభౌములు కూడా వీరి ముందు దిగడుపే కదా!  తమ్ముని రాజకీయం రసపట్టులో పడగానే జనం తన ప్రజారాజ్య ఉదంతం మరచిపోయి ఉంటారని భావించిన అన్న ఇక ఇదే అదునుగా కొత్త రాజకీయానికి తెరలేపారు. 

నిన్నటి వరకు కాంగ్రెస్ నీడన బ్రతుకీడ్చి, నేడు తనకూ కాంగ్రెస్ పార్టీకీ ఇక ఎలాంటి సంబంధం లేదని, రాజీనామా చేశానని ప్రకటిస్తే తీవ్రమైన విమర్శలు వస్తాయని భయపడి, వ్యూహాత్మక “గాలి వార్తలను” వదిలాడు. తద్వారా తన తమ్ముడి జనసేన పార్టీకి పరోక్షంగా సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాడు.

మొత్తానికి సామాన్య జనం అనుకుంటున్నది ఏమిటంటే! నిన్నటి దాకా తెలుగుదేశంతో సంసారం చేసి, చంద్ర బాబు కుటిల రాజకీయాలు వంట బట్టించుకున్న పవన్,  గత ఆరేడేళ్ళకుపైగా కాంగ్రెస్ నీడలో అధికారం అనుభవించి అవకాశ వాద రాజ కీయాలు తనువెల్లా-నిలువెల్లా ఒంటబట్టించుకున్నచిరంజీవి ఇద్దరు విచిత్ర సహోదరుల్లా రాజకీయాల్లో భలే! భలే!గా నటించేస్తున్నారే! అని. రోజువారీ వీరి ప్రవర్తన అవకాశవాద రాజకీయాల నుండి విడుదలయ్యే కామెడీని వినోదాన్ని ఎంజాయ్  చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: