కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతికి ప్రమాదం తప్పింది. మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేటలో ఈరోజు నిర్వహించిన ప్రచార సభలో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజయశాంతి అభివాదం చేస్తున్న సమయంలో సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ ఈ ప్రమాదంలో పార్టీ నేతలు విజయశాంతి, మల్లు భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య తదితర నాయకులకు ప్రమాదం తప్పించుకున్నారు.
అందరూ ఒకేసారి రావడంతో స్టేజ్ స్వల్పంగా కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, నేతలకు గానీ ఎటువంటి ప్రమాదం జరక్కపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. సభలో మాట్లాడేందుకు విజయశాంతి ముందుకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారికి కిందపడిపోయారు.
అప్రమత్తమైన పలువురు మహిళా నేతలు రాములమ్మను పైకి లేపారు. కాగా వేదిక ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్టేజ్ పై కాకుండా ప్రచారరథం నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రసంగాన్ని ముగించారు. అయితే ఈ ప్రమాదం కారణంగా తమ దిష్టి పోయిందని పలువురు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.