జనాల చెవిలో పూలు పెట్టటానికి చంద్రబాబునాయుడు మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టుబోతున్నారు. అందుకు దుర్గమ్మ పేరుతో సెంటిమెంటును అద్దుతున్నారు. మొన్నటి వరకూ పోలవరం యాత్రలని జనాలను ఊదరగొట్టిన ప్రభుత్వం త్వరలో అమరావతి యాత్రలను మొదలుపెట్టాలని నిర్ణయించింది. మొన్నటి పోలవరం యాత్ర అయినా త్వరలో మొదలయ్యే అమరావతి యాత్రలైనా కేవలం జనాలను సెంటిమెంటుతో ఓట్లు కొల్లగొట్టేందుకే అన్నదానిలో సందేహం లేదు.
త్వరలో అమరావతి యాత్రట
ఇంతకీ అమరావతి యాత్రలో ఏముంటుంది చూడటానికి ? నిజం చెప్పాలంటే అక్కడ చూడటానికి ఏమీ లేదనే చెప్పాలి. పోలవరం యాత్రలో జనాలకు ప్రభుత్వం ఏం చూపింది ? 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే పోలవరం నిర్మాణం పనులు సుమారు 40 శాతమైంది. గడచిన నాలుగేళ్ళల్లో చంద్రబాబు చేసింది సుమారుగా ఓ 20 శాతం పనులు మాత్రమే. కానీ ఇప్పటి వరకూ జరిగిన 58 శాతం పనులూ తానే చేశానని చెప్పుకుంటున్నారు. సరే ఏదో జాతీయప్రాజెక్టు కాబట్టి మామూలుగా అయితే అందరూ చూసే అవకాశం లేదు కాబట్టి ప్రాజెక్టును జనాలు చూశారనే అనుకుందాం.
నిర్మాణాల్లో ఏముంటుంది చూడటానికి ?
మరి, అమరావతిలో ఏముంది చూడటానికి ? మంత్రులు, ఎంఎల్ఏలు, ఉన్నతాధికారులు, గెజిటెడ్ అధికారులు తదితరులుండేందుకు అపార్టుమెంట్లు కడుతున్నారు. కొండవీటి వాగుపై ఎత్తిపోతల పథకం నిర్మాణమవుతోంది. తాత్కాలిక హైకోర్టు భవనం నిర్మాణంలో ఉంది. కొద్దిపాటి వర్షానికే భారీగా లీకవుతున్న తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలున్నాయి. ఈ నిర్మాణాల్లో జనాలు ప్రత్యేకంగా చూడటానికి ఏమీ లేదని చెప్పాలి. ప్రపంచస్ధాయి రాజధాని నిర్మాణ పనులను కూడా జనాలకు ప్రభుత్వం చూపుతుందంటున్నారు. అసలింత వరకూ రాజధాని నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. అందుకు మాస్టర్ ప్లానే పూర్తిగా ఆమోదం పొందలేదు. నిర్మాణాలే ప్రారంభం కాకపోతే ఇక చూడటానికి ఏముంటుంది ? కాకపోతే ముందుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారి దర్శనం చేయిస్తారట. మొత్తం మీద ఏదో సెంటిమెంటును అద్ది ఓట్లు కొల్లగొట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగ కనబడుతోంది. మరి, సెంటిమెంటుకు జనాలు పడిపోతారా ?