వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో తెలుగుదేశంపార్టీ నేతలు చంద్రబాబునాయుడుకు పని తగ్గించేస్తున్నారు. మామూలుగా అయితే ఎవరికైనా టిక్కెట్లు కేటాయించాలంటే చంద్రబాబు ఒక పట్టనా అంగీకరించరు. సదరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏకు కావచ్చు లేదా సదరు నేతకు టిక్కెట్టు విషయంలో పోటీ కూడా ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబు మాత్రం అందరినీ టెన్షన్లో పెట్టి చివరి నిముషంలో మాత్రమే టిక్కెట్టు ఖరారు చేస్తారు. ఎప్పుడో అర్ధరాత్రి తర్వాత ప్రకటిస్తారు. చంద్రబాబు నైజమంతే అని నేతలందరూ సరిపెట్టుకుంటున్నారు.
ఎవరికి వారే ప్రకటించేసుకుంటున్నారు
కానీ ప్రస్తుతం పార్టీలో పరిస్ధితులు మారిపోతున్నాయి. పలువురు నేతలు ఎవరికి వారుగా టిక్కెట్లు ప్రకటించేసుకుంటున్నారు. మరి కొందరు నేతలైతే తమ వారసులకు టిక్కెట్లు కేటాయించేసుకుంటున్నారు. మధ్యలో నారా లోకేష్ కూడా కొందరికి టిక్కెట్లు ప్రకటించేస్తున్నారు. ఇలా ఎవరికి వారుగా టిక్కెట్ల విషయంలో సొంత నిర్ణయాలు అమలు చేసేస్తుండటంతో చంద్రబాబుకు పని తగ్గిపోతోంది.
టిక్కెట్లు ప్రకటించేసిన జెసి బ్రదర్స్
ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో తాను పోటీ చేయటం లేదని సిట్టింగ్ ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. తాను పోటీ చేయబోవటం లేదని చెప్పటం వరకూ బాగానే ఉంది. ఎందుకంటే పోటీ చేయటం, చేయకపోవటం ఆయనిష్టం. కానీ తన స్ధానంలో తన కొడుకు అశ్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు చేసిన ప్రకటనతోనే అందరూ ఆశ్చర్యపోయారు. కొద్ది రోజుల క్రితం అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఎంపిగా తనకు బదులు తన కొడుకు పవన్ రెడ్డి పోటీ చేస్తారంటూ ప్రకటించేశారు. అంటే జెసి సోదరులు తమ వారసులకు వారే టిక్కెట్లు ప్రకటించేసుకున్నారన్నది అర్ధమైపోతోంది.
లోకేష్ పెట్టిన చిచ్చు
ధర్మవరంలో రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేయబోయేది తానే అంటూ పరిటాల శ్రీరామ్ చేసిన ప్రకటన సంచలనమైంది. ఇక కర్నూలులో పోటీ చేయబోయేది తానే అంటూ టిజి భరత్ చేస్తున్న ప్రకటన ఎంతటి దుమారాన్ని రేపుతోందో అందరకి తెలిసిందే. సిట్టంగ్ ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డికి, ఎంపి బుట్టా రేణుకకు టిక్కెట్లను నారా లోకేష్ ప్రకటించిన తర్వాత ఎంత గొడవైందో అందరూ చూసిందే.