ఎడిటోరియల్ : మోడి, చంద్రబాబు..ఇద్దరిలో ఎవరు చాణుక్యుడు ?
రాజ్యసభ డిప్యుటి ఛైర్మన్ ఎన్నిక ఫలితం తర్వాత ఒక విషయంపై అందరిలోనూ ఒక అనుమానం మొదలైంది. అదే చంద్రబాబునాయుడు చాణుక్యంపై. ఎందుకంటే, రాజ్యసభ డిప్యుటి ఛైర్మన్ కు జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్ధిని కాదని జనతాదళ్ (యు )అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ సింగ్ ను పోటీ పెట్టింది. అదే యూపిఏ తరపున కాంగ్రెస్ అభ్యర్ధి బికె హరిప్రసాద్ నిలబడ్డారు. దాంతో బిజెపి బలపరచిన ఎన్డీఏ అభ్యర్ధి గెలిచి యూపిఏ తరపున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోయారు. ఇక్కడే ప్రధానమంత్రి నరేంద్రమోడి చాణుక్యంతో పాటు చంద్రబాబునాయుడు చాణుక్యంపైన కూడా చర్చ మొదలైంది.
మీడియా పవర్ ఎక్కువ
మామూలుగా అయితే నరేంద్రమోడిని తెలుగు మీడియా చాణుక్యుడని చెప్పదు. అదే చంద్రబాబు గురించైతే ఎక్కడబడితే అక్కడ చాణుక్యుడని పదే పదే ఊదరగొడుతుంటుంది. సేఫ్ జోన్లో ఉండి రాజకీయాలు చేస్తున్నా కూడా టిడిపికి మద్దతిచ్చే మీడియా చంద్రబాబును అపర చాణుక్యుడనే ఆకాశానికి ఎత్తేస్తుంటుంది. అదే చంద్రబాబు సమస్యల్లో నుండి బయటపడలేక అవస్తలు పడుతున్నపుడు మాత్రం చంద్రబాబు గురించి మాట్లాడకుండా ప్రత్యర్ధులపై దుమ్మెత్తిపోస్తుంటుంది. ఆ విధంగా తన మీడియా మేనేజ్ మెంట్ పవర్ తో చాణుక్యతనాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
మోడి చాణుక్యంతో గెలిచిన ఎన్డీఏ అభ్యర్ధి
అటువంటిది తాజాగా జరిగిన డిప్యుటీ ఛైర్మన్ ఎన్నికల్లో చంద్రబాబు చాణుక్యం ఏమైందనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. ఎందుకంటే చంద్రబాబు అంతటి సీనియర్ నేత యూపిఏకి మద్దతిచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోయారంటే ఏమనుకోవాలి ? ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. చంద్రబాబు చాణుక్యం పనిచేయలేదు. ఎలాగంటే, బిజెపికి రాజ్యసభలో బలం లేదు కాబట్టే మోడి జెడియు అభ్యర్ధిని రంగంలోకి దింపారు. బిజెపి అభ్యర్ధి అంటే కొన్ని పార్టీలు మద్దతు విషయంలో వెనకాడి ఉండేవి. ఆ విషయం గ్రహించే అవకాశం జెడియుకి ఇచ్చారు, గెలిపిచుకున్నారు.
టిఎంసి, ఎస్పీ అభ్యర్ధులయ్యుంటే బాగుండేదేమో ?
అదే యూపిఏకి వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ లో జరిగింది. కాంగ్రెస్ అభ్యర్ధంటే యూపిఏలోని పార్టీలు తప్ప ఇంకే పార్టీలు మద్దతు ఇవ్వలేదు. అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ కాస్త జాగ్రత్తగా గేమ్ ప్లే చేసుంటే కచ్చితంగా ప్రతిపక్షాల అభ్యర్ధే గెలిచుండే వారనటంలో సందేహం లేదు. ఎందుకంటే, రంగంలోకి కాంగ్రెస్ అభ్యర్ధిని బదులుగా యూపిఏ పక్షాలకు చెందిన ఇంకెవరైనా అంటే తృణమూల్ కాంగ్రెస్ లేదా ఎస్పీ అభ్యర్ధులయ్యుంటే బాగుండేది. అప్పుడు యూపిఏ పార్టీలే కాకుండా తటస్తంగా ఉన్న పార్టీలు కూడా ఓట్లు వేసేవే. దాంతో ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్ధి గెలిచుండేవారేమో ? ఒకవేళ గెలవలేకపోయినా ఎన్డీఏ అభ్యర్ధిని గెలిపించుకోవటంలో మోడి అండ్ కో కు చెమటలు పట్టేవనటంలో సందేహం లేదు.
చంద్రబాబు చాణుక్యం పనిచేయలేదా ?
మరి, ఇక్కడే చంద్రబాబు లాంటి అపర చాణుక్యుడు కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడి కూడా ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధికి చెప్పలేకపోయారా ? చంద్రబాబుకు దేశంలోని అన్నీ పార్టీలతోనూ మంచి సంబంధాలున్నాయి కదా ? తన సంబంధాలను ప్రతిపక్షాల అభ్యర్ధిని గెలిపించుకునేందుకు చంద్రబాబు ఉపయోగించి ఉండొచ్చు కదా ? ఆ పని ఎందుకు చేయలేకపోయారు ? కాంగ్రెస్ అభ్యర్ధికి గెలుపు అవకాశాలు తక్కువని చంద్రబాబుకు తెలీదా ? లేకపోతే మోడి చాణుక్యం ముందు చంద్రబాబు చాణుక్యం పనిచేయలేదా ?