టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి తెలంగాణపై తన అక్కసు కక్ష వెళ్ళగక్కారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మాట్లాడిన గల్లా జయదేవ్ తన ప్రసంగం చివరలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అశాస్త్రీయంగా విభజించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పూర్తి మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని ఎంపీ జితేందర్రెడ్డి స్పష్టం చేశారు.
పార్లమెంట్ లో ఆమోదం పొందిన బిల్లు అప్రజాస్వామికం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజాస్వామికంగానే జరిగిందని తేల్చి చెప్పారు. అప్రజాస్వామికం అనే మాటను లోక్-సభ రికార్డుల్లో నుంచి తొలగించాలని సభాపతికి జితేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రసంగం మొదట్లో కూడా గల్లా జయదేవ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు అని పేర్కొన్నారు. తెలుగు తల్లిని కాంగ్రెస్ రెండుగా చీల్చింది అని నరేంద్ర మోదీ అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ, తల్లిని చంపి బిడ్డను బతికించిందని నరెంద్ర మోదీనే అన్నారని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.