ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతలను అయోమయంలో పడేస్తోంది. ఆయన పార్టీ మారిపోతారనే ప్రచారం జోరందుకుంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో.. ప్రతిపక్ష పార్టీ గెలుస్తుందనేలా ఫలితాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. పార్టీలో కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నొచ్చుకున్న ఆయన.. ఇక సైకిల్ దిగి జనసేనలో చేరిపోతారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. అయితే తనతో పాటు టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలను కూడా జనసేనాని చెంతకు చేర్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న ఆనం రాంనారాయణరెడ్డితో భేటీ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఓసారి రెవెన్యూ శాఖను చూసే కేఈ కృష్ణమూర్తి.. ఒక అధికారిని వైజాగ్ లో బదిలీ చేస్తే జనసేన పవన్ కల్యాణ్ చేత చంద్రబాబుకు చెప్పించుకుని ఆ బదిలీ ఆగిపోయేలా చేశారు గంటా. ఇది ఒక్క సంఘటన చాలు పవన్-గంటా శ్రీనివాసరావు మధ్య బంధం గురించి వివరించేందుకు! ఇక మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంటా శ్రీనివాసరావును మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిలానే చూసుకుంటారు. ప్రజారాజ్యం నుంచి మెగా ఫ్యామిలీతో గంటా సత్సంబంధాలు కొనసాగిస్తూనే వస్తున్నారు. అయితే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంతంగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో.. గంటా కూడా ఆ గూటికే చేరిపోతారనే వార్తలు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
అధికార పక్షంపై వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ నుంచి కూడా వలసలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కొత్త పార్టీ రావడంతో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగా పార్టీ వలసలు పెరుగుతాయి. పీఆర్పీ నుంచి కాంగ్రెస్ లోకి, ఆ తర్వాత తెలుగుదేశంలోకి మారుతూ.. గెలుస్తూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఎప్పటి లాగే ఈ సారి కూడా జంపింగ్ కు సిద్ధం అయిపోయారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొన్న కేబినెట్ మీటింగ్ కు ఆయన గైర్హాజరు అయ్యారు. అప్పటికే గంటాకు బాబుతో చెడింది అనే వార్తలు గుప్పుమన్నాయి. మీటింగ్ కూడా ఎగ్గొట్టడంతో అనుమానాలు బలపడ్డాయి. ఇక ఆయన టీడీపీకి పేకప్ చేప్పేస్తారని అంతా భావిస్తున్న తరుణంలో.. టీడీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డిని కలిశారు.
ఆయనే స్వయంగా రాంనారాయణ వద్దకు వెళ్లి భేటీ అవడంతో ఆయన్ను కూడా జనసేనలోకి ఆహ్వానించేందుకు వెళ్లారనే వార్తలు జోరందుకుంటున్నాయి. ఇక నాదెండ్ల మనోహర్, పవన్ భేటీ వెనుక కూడా శ్రీనివాసరావు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులతో భేటీ అయి వారిని జనసేనలో చేర్చే బాధ్యతను గంటా తీసుకున్నారే మోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగా ఉండటంతో టీడీపీని వదిలేయడమే మంచిదనే భావనలో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన వైపు కనీసం 10-15 సీట్లలో గెలుపు గుర్రాలను తేవడంతో పాటు పార్టీలో కీలక బాధ్యతలను నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి.