వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జూలై 15న విశాఖ జిల్లాలో ప్రవేశిస్తోంది. ప్రస్తుతం తూర్పు గోదావరిలో సాగుతున్న పాదయాత్ర మరో పాతిక రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ పాదయాత్రకు విశాఖ నేతలు ఏర్పాట్లు సిధ్ధం చేసుకుంటున్నారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతాన్నే టార్గెట్ చేసుకుని జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ రెడీ చేశారు. విశాఖపట్నం నగరంలో ఎక్కడా జగన్ అలికిడి ఈ యాత్రలో వుండదు. మొత్తం పాదయాత్ర పూర్తి అయిన తరువాత మిగిలిపొయిన నియోజక వర్గాలలో బస్సు యాత్రను జగన్ చేపడతారని, అపుడు విశాఖ సిటీలో పర్యటన ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.
వేడిగా విశాఖ రాజకీయం
జగన్ పక్క జిల్లాలో వుండగానే విశాఖ రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలో కీలకమైన మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత పార్టీపైనే గుర్రు మీదున్నారు. ఆయన వచ్చే ఎన్నికలల్లో పార్టీ మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని వాడుకుని ఆయనని వైసీపీ గూటికి రప్పించేందుకు జగన్ గట్టిగానే ట్రై చేస్తున్నట్లు టాక్. విశాఖ జిల్లాలో పాదయా త్ర ప్రవేశించే నాటికి బిగ్ షాట్స్ ని పార్టీలోకి తీసుకోవాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వున్నట్లు చెబుతున్నారు.
టీడీపీ నేతలే టార్గెట్ ?
విశాఖలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలైనంత వరకూ టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించాలని వైసీపీ ప్లాన్ వేస్తోంది. ఆ పార్టీలో వున్న అంతర్గత కుమ్ములాటలను క్యాష్ చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టిడిపికి గట్టిగా ఝలక్ ఇవ్వాలనుకుంటోంది. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతం. మా తలుపులు తెరిచే వున్నాయని వైసీపీ సీనియర్ నేత బొత్స ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. అయితే అధికార పార్టీ నేతల గనుక రాదలుచుకుంటే ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని షరతు విధించారు.
కాంగ్రెస్ కూ వల
వచ్చే ఎన్నికలకు ఏం చేయలో పాలుపోని స్థితిలో వున్న కాంగ్రెస్స్ నేతలపైనా వైసీపీ గురి పెట్టేసింది. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తో పాటు, నగరానికి చెందిన కీలక నాయకులను ఫ్యాన్ నీడకు చేర్చేందుకు వైసీపీ వ్యూహ కర్తలు ట్రై చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరావుతో పాటు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి క్రుపారాణికీ వైసీపీ తీర్ధం ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.