వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ఎత్తుల మీద ఎత్తులతో విశ్వప్రయత్నాలు చేస్తోన్న వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఎక్కడ ఏ ఎత్తు వేయాలో అదే ఎత్తుతో ముందుకు వెళుతున్నారు. ప్రతి సీటు విషయంలోనూ ఎంతో సునిశితంగా పరిశీలన చేస్తూ క్యాండెట్లను ఎంపిక చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజికవర్గంలో కీలకమైన వ్యక్తులను ఆకర్షించడంలో సక్సెస్ అయిన జగన్ ఈ రెండు జిల్లాల్లో రెండు ఎంపీ సీట్లతో పాటు కనీసం 10కి తగ్గకుండా అసెంబ్లీ సీట్లను కూడా ఈ సామాజికవర్గానికి ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు.
గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ఈ సామాజికవర్గానికి అనుకున్న స్థాయిలో టిక్కెట్లు ఇవ్వలేదు. కృష్ణా జిల్లాలో అయితే కేవలం గుడివాడ అసెంబ్లీ సీటు మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణాలో 5 అసెంబ్లీ సీట్లతో పాటు విజయవాడ ఎంపీ సీటు, గుంటూరులో గుంటూరు ఎంపీ సీటుతో పాటు 6 అసెంబ్లీ సీట్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని కీలక నియోజకవర్గాల్లో జగన్ ఇప్పుడు ఎన్నారై స్ట్రాటజీ అమలు చేస్తూ టీడీపీ సిట్టింగ్లకు చెమటలు పట్టిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే విప్ చింతమనేని ప్రభాకర్ను ఢీ కొట్టేందుకు ఎన్నారై అయిన వైసీపీ యూరప్, యూకే కన్వినర్ కొఠారు అబ్బయ్య చౌదరిని రంగంలోకి దింపారు. వైసీపీని యూరప్, యూకేలో పటిష్టం చేసేందుకు కృషి చేయడం, ఉన్నత విద్యావంతుడు కావడం, ప్రజల్లో సౌమ్యుడిగా గుర్తింపు ఉండడంతో పాటు ఇటు ప్రభాకర్ సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో దెందులూరులో ఈ సారి హోరా హోరీ పోరు తప్పేలా లేదు. దెందులూరులో ప్రభాకర్ను ఢీ కొట్టేందుకు జగన్ ఎన్నారై స్ట్రాటజీ బాగా వర్కవుట్ అయినట్టే అక్కడ పొలిటికల్ వాతావరణం చెపుతోంది. ఇక్కడ ప్రభాకర్ మీద వ్యతిరేకత అంతా ఇప్పుడు అబ్బయ్యకు కలిసొచ్చేలా ఉంది.
ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోనూ జగన్ ఇదే ఎన్నారై స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ముత్తుముల అశోక్ రెడ్డి జగన్కు హ్యాండ్ ఇచ్చి ఆపరేషన్ ఆకర్ష్లో సైకిల్ ఎక్కేశారు. జగన్ అశోక్రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు ఇచ్చినా కూడా ఆయన పార్టీ మారిపోయారు. ఇక్కడ కూడా జగన్ ఎన్నారై అయిన ఐవి.రెడ్డిని నియోజకవర్గ కన్వీనర్గా నియమించారు. గిద్దలూరు వైసీపీ సమన్వయకర్తగా ఉన్న ఐవి.రెడ్డి నియోజకవర్గంలో కలియతిరుగుతూ పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారినా అక్కడ స్థానిక టీడీపీ కేడర్ నుంచి సహకారం లేకపోవడంతో అశోక్రెడ్డికి పట్టు దొరకడం లేదు. ఇవన్నీ ఐవి.రెడ్డికి కలిసి రానున్నాయి.
ఏదేమైనా జగన్ ఎన్నారై స్ట్రాటజీని విజయవాడ ఎంపీ సీటు విషయంలో కూడా అనుసరించాలని చూస్తున్నాడు. అలాగే రాయలసీమ జిల్లాల్లోనూ కొన్ని సెగ్మెంట్లలో ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. మరి ఈ స్ట్రాటజీలు ఎన్నికల్లో ఎలా వర్కవుట్ అవుతాయో ? చూడాలి.