వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అవినీతే ప్రధాన అజెండా కాబోతోంది...ఇది తాజాగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు. చంద్రబాబుపై 16 రకాల అవినీతి గురించి జనాలు మాట్లాడుకుంటున్నారట. త్వరలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన తర్వాత ఏపిలో పరిస్ధితులు మారిపోతాయట. అలాగని మురళి ఆశపడుతున్నారు. అయినా చంద్రబాబును తాము తక్కువ అంచనా వేయటం లేదని కూడా మురళీనే చెప్పారు.
అవినీతిని జనాలు పట్టించుకుంటున్నారా ?
ఇక విషయానికి వస్తే అవినీతి అన్నది ఎన్నికల్లో ప్రధాన అంశంగా జనాలు చూస్తున్నారా అన్నదే సందేహం. పార్టీల అవినీతిని, నేతల అవినీతిని జనాలు పట్టించుకోవటం మానేసి చాలా కాలమే అయినట్లు అనిపిస్తోంది. నిజంగానే జనలు గనుక అవినీతికి అంతటి ప్రధాన్యత ఇస్తుంటే ఏ నేత కూడా బరితెగించి అంతటి అవినీతికి పాల్పడడన్నది వాస్తవం. అదే సందర్భంలో నేతలెవరైనా నిజంగానే అవినీతికి పాల్పడినా నిరూపించటం ఎంతటి కష్టమో అందరూ చూస్తున్నదే. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి చూసుకున్నా దేశం మొత్తం మీద అవినీతి ఆరోపణలు రుజువై శిక్షలు పడిన నేతలు ఎంతమంది ఉంటారు ?
శిక్షలు పడినవారు ఎంతమంది ?
అవినీతి ఆరోపణలు ఎదురుర్కొంటున్న నేతలు కొన్ని వందలమందుంటారు. నేతల అవినీతిపై నమోదైన కేసులు కూడా వేలల్లోనే ఉంటుందనటంలో సందేహమే లేదు. ఏదో గ్రహస్దితి బావోలేక జయలలిత, శశికళ, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి చాలా కొద్దిమంది నేతలకు మాత్రమే శిక్షలు పడ్డాయి. వాళ్ళు కూడా తమకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులపై పై కోర్టుల్లో అప్పీలు చేసుకోవటం, బెయిల్ పై బయటే తిరగటం, ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకోవటం కూడా మనం చూశాము. అవినీతి ఆరోపణలపై శిక్షలు పడిన తర్వాత కూడా జయలలిత, లాటూప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళని జనాలు గెలిపించిన సంగతి కూడా మనం చూశాం. అంటే అర్ధమేంటి ? అవినీతి అన్నది ప్రధాన అంశం కానేకాదని.
ఎంతమందిపై ఆరోపణలున్నాయ్ ?
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు దేశంలో కొన్ని వేలమందున్నారు. చంద్రబాబు, కరుణానిధి, కుమారస్వామి,మాయావతి, యడ్యూరప్పతో పాటు కొందరు బిజెపి పాలిత ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానుల్లో కొందరు ఇలా...చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే అవుతుంది. ఇక, కేంద్రమంత్రులు, రాష్ట్రాల్లో మంత్రులు, ఎంపి, ఎంఎల్ఏల సంఖ్య చెప్పనే అక్కర్లేదు. చంద్రబాబు అవినీతిపై కోర్టుల్లో 16 కేసులు స్టేల మీద కంటిన్యూ అవుతున్నాయని వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇక, జగన్మోహన్ రెడ్డి మీదున్న లక్ష కోట్ల రూపాయల ఆరోపణల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. నేతల్లో ఎవరెంత తిన్నా తమకేమి ఇస్తున్నారనే జనాలు కూడా చూస్తున్నారు.
జనాలు ఎందుకు పట్టించుకోవటం లేదు ?
నేతల అవినీతిని జనాలు ఎందుకు పట్టించుకోవటం లేదన్నది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే, ప్రతీ నాయకుడుని, ప్రతీ పార్టీని జనాలు ఒకే తానుగుడ్డలుగా చూస్తున్నారు కాబట్టి. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ అధికారపార్టీ అవినీతిపై ఆరోపణలు చేస్తున్న పార్టీ, రేపటి రోజున అధికారంలోకి వస్తే చేసేది అదే అనే అభిప్రాయం జనాల్లో బాగా నాటుకుపోయింది. పైగా ఎన్నికల సమయంలో ఓటుకింత అని నేతల దగ్గర నుండి డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకుంటున్న తర్వాత జనాలు కూడా అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోయారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నాయకుడైనా ఆస్తులను కోల్పోయిన ఉదాహరణ దేశం మొత్తం మీద ఒక్కటైనా ఉందా ? మురళీధర్ రావు చెబుతున్నట్లు నిజంగానే అవినీతి ప్రధాన అంశమే అయితే పోయిన ఎన్నికల్లో జగన్ పై జరిగిన ప్రచారం అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి, అంత ప్రచారం జరిగిన తర్వాత కూడా 67 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్ధానాల్లో జనాలు వైసిపిని ఎలా గెలిపించారు ?