వచ్చే ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్టునే తురుపుముక్కగా ప్రయోగించాలని చంద్రబాబునాయుడు ప్లాన్ వేస్తున్నట్లున్నారు. అందుకనే, రాష్ట్రంలోని జనాలందరూ పోలవరం ప్రాజెక్టును సందర్శించాలంటూ ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. అప్పటికేదో పోలవరం ప్రాజెక్టును పునాదుల దగ్గర నుండి ఇప్పటి వరకూ తానే నిర్మించినట్లు బిల్డప్ ఇస్తున్నారు. రాజధాని నిర్మాణం ఎలాగూ మొదలుకాలేదు. ఎప్పటికి మొదలవుతుందో కూడా ఎవరూ చెప్పలేకున్నారు. చెప్పుకోవటానికి నాలుగేళ్ళల్లో పూర్తి చేసిన పథకం ఒక్కటి కూడా లేదు. అందుకనే చంద్రబాబు దృష్టంతా ఇపుడు పోలవరం మీద పడింది. మంగళవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన ప్రస్తావనతో ఆ విషయం స్పష్టమైంది.
దేశంలో ఇంకెవరూ కష్టపడటం లేదు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రజలు ప్రతిరోజు 13 బస్సులలో వెళ్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ ఇప్పటివరకు 22 వేల మంది ప్రజలు పోలవరాన్ని సందర్శించారన్నారు. ఒక ప్రాజెక్టు కోసం ఇంతగా కష్టపడుతున్న సందర్భం దేశంలో ఎక్కడాలేదన్నారు. ‘మీకు నా నుండి ఎప్పుడైనా ఫోన్ రావచ్చు’నని చంద్రబాబు అన్నారు.
ఎన్నికల్లో గెలుపే ముఖ్యం
పార్టీ కోసం, రాష్ట్రం కోసం కఠినంగా ఉండక తప్పదని, వింటే వ్యక్తిగతంగా చెప్తా, వినని పక్షంలో ప్రజల్లోనే చెప్తానని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వం చేసిన పనులపై ప్రచారం విస్తృతంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, మౌత్ ప్రచారంతో ముందుకుసాగాలన్నారు. ఎలా కష్టపడ్డామన్నది కాదని, గెలుపు ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగాలంటే అన్నింటిపై అవగాహన పెంచుకోవాలన్నారు.
సోషల్ మీడియానే దిక్కు
సోషల్ మీడియాను నేతలంతా విస్తృతంగా వాడుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. సహజ వనరులను దోచుకుంటున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో దోచుకోకుండా మిగిల్చింది ఏమైనా ఉందా జగన్? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కింద... సహజ ఖనిజాలు, బాక్సైట్, లైమ్ స్టోన్ తిన్నారని, 13 చార్జిషీట్లలో జగన్ దోచుకున్న మెనూ మొత్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు.