ఈ మద్య కాలంలో వీధి కుక్కల స్వైరవిహారం మరీ పెరిగిపోతున్నాయి. ఆ మద్య విశాఖపట్టణంలో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన వార్త తెలిసిందే. తాజాగా ఇలాంటి సంఘటనే గుంటూరు లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరులో నగర శివారులోని అడవితక్కెళ్లపాడులో ఐదేళ్ల బాలుడిపై ఊర కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. బాలుడి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
కుక్కలు దాడి చేయడంతో ఐదేళ్ల బాలుడు రోడ్డుపైనే కదలలేని స్థితిలో రక్తపు మడుగులోనే ఏడుస్తూ కనిపించాడు. కుక్కలు దాడి చేస్తున్న సమయంలో బాలుడి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఇంట్లో వాళ్లతోపాటు చుట్టు పక్కల వారు బయటకు వచ్చి చూశారు. ఆ చిన్నారిని గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.
కుక్కల దాడి వల్ల అధికంగా రక్తస్రావం కావడంతో బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, గతంలోను గుంటూరులో కుక్కల దాడులు అనేకం చోటు చేసుకున్నాయి.
గతంలో ఒక పాపపై దాడి చేసి ఆమె మృతికి కారణమయ్యాయి. నెల రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఓ మహిళపై పందులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనను మర్చిపోక ముందే ఈ ఘటన జరిగింది. సంబంధిత అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.