ఓవైపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో మరో శుభవార్త ఆ రాష్ట్రానికి ఆనందం తెచ్చింది. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం కనబర్చడంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణా నిలిచి అరుదైన గౌరవం దక్కించుకుంది. సాంకేతికతను ఈ పథకంతో అనుసంధానం చేసిన ఫలితంగా ఈ గౌరవం దక్కింది.
ఇప్పటి వరకు పథకం ద్వారా ఏర్పడ్డ ఆస్తులను ఆన్ లైన్లో భువన్ సాఫ్ట్ వేర్ ద్వారా నిక్షిప్తం చేసినందుకు జియో ఎంజీఎన్ఆర్ఈజీఏ పురస్కారాన్ని కూడా తెలంగాణ కైవసం చేసుకోవడం విశేషం. ఇక తెలంగాణలోనూ జిల్లాల వారీగా ఫలితాలను ప్రకటించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా గా ఉమ్మడి వరంగల్ ఎంపికైంది. ఉత్తమ గ్రామ పంచాయతీగా నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ గ్రామ పంచాయతీ ఎంపికైంది.
ఈ గ్రామం ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించిన గ్రామంగా జాతీయ స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. ఉపాధి కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు చెల్లినందుకు తపాలా శాఖ తరపున నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోస్టు మాస్టర్ అబ్దుల్ సత్తార్ కు పురస్కారం దక్కింది. జూన్ 19న విజ్ఞాన భవన్లో జరిగే కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తారు.