ఒకే రోజున ఐదుగురు హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు...!!
ఒకే రోజున ఐదుగురు హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన సంఘటన నిన్న హైదరాబాద్ లో వెలుగు చూసింది. పరిస్థితుల ప్రభావమో, జీవితంపై విరక్తో, మానసిక పరిస్థితి సరిగా లేదో ఇలాంటి పలు కారణాలతో ఏకంగా ఐదుగురు ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే వీరందరిని స్థానిక పోలీస్ సిబ్బంది గమనించి వారిని కాపాడడం జరిగింది. పార్శీగుట్టకు చెందిన బి.సతీష్ (26) మద్యంతాగి ఇంటికి వెళ్లాడు. మద్యం తాగి ఉన్న తన కొడుకుని చూసి తల్లిదండ్రులు అతన్ని తీవ్రంగా మందలించారు. ఆ కోపంతో అతను ట్యాంక్ బ్యాండ్ దగ్గరికి వెళ్లి ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టాడు.
ఆ తరువాత హబ్సిగూడ ప్రాంత గృహిణి ఎస్.ఊర్మిళ (43) భర్త నుంచి విడాకులు తీసుకుని పిల్లలతో కలసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె గురువారం రాత్రి కజిన్ తో గొడవపడింది. ఈ క్రమంలో మానసిక సంఘర్షణకు గురైన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయంతో హుస్సేన్ సాగర్ చేరింది. అలాగే తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకు చెందిన ఎం.కె.సంధ్య (36) భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడడం భరించలేకపోయింది. ఈ విషయం పై భర్తను నిలదీసినా ప్రయత్నం లేకపోవడంతో జీవితంపై విరక్తి కలగడంతో ట్యాంక్ బండ్ చేరుకొని ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టింది.
కుషాయిగూడకు చెందిన బి.షైనే (21) నిత్యం భర్త మద్యం మత్తులో ఇంటికి చేరడంతో విసిగిపోయి గొడవపడింది. ఈ క్రమంలో ఇక ఈ వేదన భరించే కంటే చావే మేలని భావించి హుస్సేన్ సాగర్ చేరింది. అదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న లేక్ పోలీస్ స్టేషన్ బ్లూకోట్స్ కానిస్టేబుల్స్ ఎన్.శ్రీనివాస్, సి.సాయికిరణ్, ఫజల్ అహ్మద్ ఖాన్, బి.నీర్జూ, ఇస్మాయిల్ బిన్ సలామ్, హోంగార్డు పి.వెంకట్రావు, డి.రవి. జీవన్ వీరిని గమనించారు. వేగంగా స్పందించి వారికి సర్దిచెప్పి, స్టేషన్ కు తీసుకెళ్లారు. వారి కుటుంబ సభ్యులను పిలిపించి ఐ కౌన్సిలింగ్ ఇప్పించారు.