తెలంగాణలో బలపడటమే లక్ష్యంగా కదులుతున్న బీజేపీ...ఈ క్రమంలో టీఆర్ఎస్ను టార్గెట్ చేసుకొని ఒకింత దూకుడుగానే ముందుకు సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీని కుటుంబ పార్టీగా విమర్శించే బీజేపీ తాజాగా ఆ పార్టీ నేతలపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కుమార్తె మాజీ ఎంపీ కవిత టార్గెట్గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ నాయకురాలు డీకే అరుణ నిజామాబాద్ లో మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకుందని డీకే అరుణ అన్నారు. కవిత స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకోవడాన్ని ఆమె గుర్తు చేశారు. అవినీతికి తావు లేదన్న కేసీఆర్ ఆయన బిడ్డ కవిత పై చాలా ఆరోపణలు వచ్చినా విచారణ జరిపించలేదని చెప్పారు. ఇక.. కేటీఆర్ ట్విట్టర్కే పరిమితం అయ్యారని అరుణ ఎద్దేవాచేశారు. నాయకులు ఆయన్ను కలవరని, ఈ విషయం టీఆర్ఎస్ పార్టీ నేతలంతా చెప్తారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ దేశానికి ఆదర్శం అనడం పచ్చి అబద్ధమని అరుణ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కమీషన్ ఏజెంట్లుగా వ్వవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చుపెడుతున్నామంటూ… వేల కోట్ల ధనాన్ని టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. తొందరలోనే టీఆర్ఎస్ చేసిన అవినీతిని తాము బయటపెడతామని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని అసహ్యించుకుంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జీజేపీ విజయం సాధిస్తుందని అరుణ చెప్పారు.