పెమ్మ‌సానికి బాబు కీల‌క బాధ్య‌త ... మామూలు హోం వ‌ర్క్ కాదుగా...!

RAMAKRISHNA S.S.
గుంటూరు ఎంపీగా, అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కు ముఖ్యమంత్రి ఎన్‌. చంద్ర‌బాబు నాయుడు కీలక బాధ్యతలు అప్పగించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారిన రెండు ప్రధాన అంశాల్లో కేంద్రాన్ని ఒప్పించి అనుకూల నిర్ణయాలు తీసుకురావాల్సిన బాధ్యతను చంద్రశేఖర్‌కు అప్పగించినట్టు చంద్రబాబు స్వయంగా పార్టీ ముఖ్య నేతలకు చెప్పినట్టు సమాచారం. ఆ రెండు అంశాల్లో మొదటిది అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడం కాగా, రెండోది కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులను సాధించడం. కేంద్రంలో మంత్రిగా ఉండటమే కాకుండా, రాష్ట్ర ప్రయోజనాలను బలంగా వినిపించి నిధులు తీసుకురావాల్సిన బాధ్యతను పెమ్మసాని చంద్రశేఖర్ భుజాలపై వేసినట్టు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని చంద్రశేఖర్ కూడా తాజాగా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.


చంద్రబాబు తనకు భారీ హోంవర్క్ ఇచ్చారని, అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగాలంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడమే కీలకమని, ఆ బాధ్యత తనకు అప్పగించారని ఆయన చెప్పారు. ఇక అమరావతి రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ కీలక మలుపు తీసుకుంటోంది. 2019–24 కాలంలో అమరావతి అంశం ఎంతటి రాజకీయ వేడిని రేపిందో తెలిసిందే. రానున్న 2029 ఎన్నికల్లో కూడా ఈ అంశం కీలకంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్‌ను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని సాంకేతిక, రాజకీయ అడ్డంకులు ఎదురవుతున్నట్టు సమాచారం.


వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే అమరావతి బిల్లుకు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావించింది. కానీ రెండు మూడు కీలక అంశాల కారణంగా అమరావతి వ్యవహారం తాత్కాలికంగా వెనక్కి వెళ్లింది. దీంతో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన కసరత్తు బాధ్యతను పెమ్మసాని చంద్రశేఖర్‌కు అప్పగించారు. ముఖ్యంగా అమరావతి పరిధిలోని నియోజకవర్గానికి చెందిన ఎంపీగా ఉండటంతో, అమరావతి చట్టబద్ధత బాధ్యతను తానే భుజాన వేసుకుంటున్నట్టు చంద్రశేఖర్ ప్రకటించడం విశేషంగా మారింది. ఒకవైపు కేంద్ర నిధులు, మరోవైపు అమరావతి చట్టబద్ధత… ఈ రెండు కీలక అంశాల్లోనూ పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించాల్సి ఉండటంతో, రానున్న రోజుల్లో ఆయన రాజకీయ ప్రాధాన్యం మరింత పెరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: