వారి గురించి పవన్‌ ఆలోచన శభాష్‌.. మనసున్న నేత అనిపించుకున్నారు?

Chakravarthi Kalyan
రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి పదేళ్ల పాటు హైదరాబాద్ అటు ఏపీ, ఇటు తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ తో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, వాటాలు, అప్పుల పంపిణీ సంగతి కాసేపు పక్కన పెడితే… ఇప్పుడు ఏపీ క్యాబ్ డ్రైవర్లకు సరికొత్త చిక్కు వచ్చి పడింది.

ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకొని హైదరాబాద్ లో ఏపీ కి చెందిన పలువురు క్యాబ్ లు నడుపుతున్నారు. అయితే ఈ డ్రైవర్లకు ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడింది. ఏపీకి చెందిన తమను తెలంగాణలో క్యాబ్ డ్రైవర్లు అడ్డుకుంటున్నారని వారు వాపోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ సీఎం.. ఉమ్మడి రాజధాని గడువు తీరగానే.. ఏపీ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ లో ఉండకూడదు అంటూ తెలంగాణ వారు అడ్డుకోవడం సమంజసం కాదు అని అభిప్రాయపడ్డారు. ఇలా అడ్డుకోవడం వల్ల సుమారు రెండు వేల కుటుంబాలు ఇబ్బంది పడతాయని వెల్లడించారు. ఇదే సమయంలో ఏపీ లో రాజధాని పనులు మొదలు కాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పిన పవన్… అప్పటి వారకు సాటి డ్రైవర్లను మానవతా దృక్పథంతో చూడాలని తెలంగాణ వాసులకు విజ్ఙప్తి చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతాను అని చెప్పి వారికి భరోసా ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకుంటానని పవన్ కల్యాణ్ ఏపీ క్యాబ్ డ్రైవర్లకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఇంత పెద్ద సమస్యను ఏ పత్రికా, న్యూస్ ఛానల్ వెలుగులోకి తేవకపోవడం గమనార్హం. మరే రాజకీయ నాయకులు కూడా ఈ అంశాన్ని గుర్తించలేదు. పవన్ కల్యాణ్ ఒక్కరే ఈ సమస్యను గుర్తించి.. దీనిని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజంగా ఇది గొప్ప విషయం అని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: