ఢిల్లీ టూర్ అట్టర్ప్లాప్.. జగన్ ఫేక్ ధర్నా పట్టించుకోని నేషనల్ మీడియా..?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 50 రోజులైనా గడవలేదు.. ఈ లోపే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఘోరంగా విఫలమైంది అంటూ వైసీపీ హడావుడి ప్రచారం మొదలు పెట్టేసింది. మొదటి రోజు నుంచే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే వ్యూహంతో వైసీపీ ముందుకు వెళుతుంది. ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పడాలంటే.. కనీసం 6 నెలల నుంచి ఏడాది పడుతుంది. కేవలం నెల రోజులకు వ్యవధిలోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ చేస్తున్న హడావుడి ప్రచారాన్ని ప్రజలు చీకొడుతున్నారు.
ఇక ఢిల్లీలో జగన్ ఏ ఏజెండాతో ధర్నా చేశారో..? అనేది వైసీపీకి చెందిన శ్రేణులకే అర్థం కావడం లేదట. వాస్తవానికి ఏదైనా పార్టీ.. లేదా ప్రజాసంఘాలు వ్యక్తులు ధర్నాలు.. నిరసనలు చేసే క్రమంలో పలు డిమాండ్లను ప్రభుత్వం.. లేదా.. ప్రజల ముందు ఉంచుతూ ఉంటారు. కానీ ఏపీలో పరిస్థితులు దేశానికి తెలియాలంటే ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేశారు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ సోషల్ మీడియా యుగంలో.. రాష్ట్రంలో ఏదైనా శాంతి భద్రతల సమస్య ఏర్పడిన, అసాంఘిక సంఘటనలు జరిగిన.. వెంటనే దేశం మొత్తం తెలిసిపోతుంది.
దేశం మొత్తం ఆ ఘటనలపై చర్చించుకుంటూ ఉంటారు. దీనికి ఉదాహరణ మణిపూర్ ఘటన చెప్పుకోవచ్చు. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడినప్పుడు దేశం మొత్తం మణిపూర్ గురించి చర్చించుకుంది. అది ఈశాన్య రాష్ట్రాలలో చిన్న రాష్ట్రం అయినా కూడా అక్కడ ఏం..? జరుగుతుందో జాతీయ మీడియా ప్రజల ముందుంచింది. ఆంధ్రప్రదేశ్లో నిజంగానే శాంతిభద్రతల సమస్య తలెత్తితే.. దానిని జాతీయ మీడియా కవర్ చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై అబాండాలు వేసేందుకు జగన్ ఢిల్లీ వేదికగా చేసిన ధర్నా డ్రామా.. వ్యూహం మొత్తం బెడిసి కొట్టింది. కనీసం నేషనల్ మీడియా దీనిని ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పాలి.