టిడిపి ప్రభుత్వం ఏర్పడి కేవలం నెల రోజులు మాత్రమే గడిచింది. దీంతో రాష్ట్రంలో ఎక్కడి కక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. టిడిపి, వైసిపి నాయకుల మధ్య ఇంకా కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు చల్లారడం లేదు. పై స్థాయి నాయకులంతా బాగానే ఉన్నారు కానీ, కిందిస్థాయి నాయకులే కొట్టుకు చస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నాయకులపై దాడులు, టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులపై దాడులు ఇలా ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ దాడుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సమస్యల పాలయ్యేది కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు మాత్రమే. దీనివల్ల ఎక్కువగా లాభపడేది పార్టీ నడిపించే అధినాయకులు.
ఇది చూసైనా ప్రజలు మారుతారా లేదంటే ఇలాగే దాడులు చేసుకుంటూ వారి ఫ్యామిలీలను ఇబ్బందులు పెడతారో అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఏపీలో వైసిపి నేతను నడిరోడ్డుపై నరికి చంపిన ఘటన కలకలం రేపింది. దీంతో రాష్ట్రమంతా అలజడలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో పుంగనూరులో కూడా టీడీపీ, వైసీపీ మధ్య పరస్పరమైనటువంటి దాడులు జరిగాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు పలువురు నాయకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నాయకులు సుహేల్ భాష ఫిర్యాదు మేరకు హత్యాయత్నంతో పాటు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇందులో పలు సెక్షన్ల కింద ఏ1 గా ఎంపీ మిథున్ రెడ్డి, ఏ2గా మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 34 మందిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందితో పాటు, మరికొంతమంది టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విధంగా వైసిపి, టిడిపి నాయకులు మధ్య జరిగినటువంటి ఈ గొడవలో ఇరువురిపై కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనను కొంతమంది వైసిపి నాయకులు దారుణంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాలేదు ఇప్పుడే ఇంతటి దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ముందు ముందు రోజుల్లో ఇంకెన్ని చూడాలో అంటూ ఎద్దేవ చేస్తున్నారు.