జగన్ ఫ్రష్ అయ్యారు.. నాయకులు క్రష్ అవుతున్నారు...!
- బెంగళూరు నుంచి వచ్చాక కూడా సమస్యలేనా
- ఎన్నికల్లో అప్పులకు నాయకుడిదే బాధ్యత అంటోన్న నేతలు
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
బెంగళూరులో సేదదీరేందుకు వెళ్లిన జగన్.. జూలై 1న తిరిగి రానున్నారు. కానీ, ఆయనకు ఇంటా బయటా కూడా ఇంకా సెగతగులుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆయన పై సొంత పార్టీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పిన జగన్ కారణంగా.. తాము రూ.కోట్ల మేరకు అప్పులు చేసి మరీ ఖర్చు చేశామని.. కానీ, ఇప్పుడు నిండా మునిగిపోయామని పలు జిల్లాల్లో నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు.. కొంత సొమ్మయినా.. తమకు ఇచ్చి ఆదుకోవాలని తాడేపల్లికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
దీంతో వైసీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఒకవైపు ఈ వేడిని.. నాయకులు ఆగ్రహాన్ని గమనించిన జగన్.. తప్పు తనదికాదనే వాదనను తెరమీదికి తెస్తున్నారు. అంతా సీఎంవో అధికారులదేనని చెప్పించారు. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లు జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు.. సీఎంవో అదికారులపై నిప్పులు చెరిగారు. కానీ.. ఈ విషయాన్ని సొంత పార్టీ నాయకులు నమ్మడం లేదు. నమ్మి ఉంటే.. వారికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నాయకులు కూడా గళం వినిపించే వారు.
ఈ నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ని మాత్రమే నమ్ముకుని ఇప్పుడు మునిగిపోయామంటూ పార్టీ కీలక నాయకులు అంతర్గత చర్చల్లో గగ్గోలు పెడుతున్నాయి. నిజానికి పోలింగ్ శాతం బాగా పెరగడంతో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిందని ఎక్కువ మంది విశ్లేషించారు. వైసీపీకి ఓటమి ఖాయమన్న ప్రచారం జరగడంతో సీఎం జగన్ రెండు రోజుల తర్వాత ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి.. దేశం మొత్తం తిరిగి చూసే విజయాన్ని సాధిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో నాయకులు కొంత మేరకు ఊరట చెందినా.. తీరా ఫలితం వచ్చాక కథ రివర్స్ అయిపోయింది.
మరోవైపు వైసీపీ గెలుపుపై నమ్మకంతో బెట్టింగులు కాసిన వారు కూడా.. భారీగా నష్టపోయారు. వీరు కూడా ఇప్పుడు వైసీపీ అంటేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి పార్టీ ఓటమితో పాటు పందేలు కూడా కోల్పోవడంతో తీవ్రంగా నష్టపోయామని.. ఈ సొమ్ములో సగమైనా ఇచ్చి తమను ఆదుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. మొత్తంగా జగన్ చుట్టూ అనేక మంది చేరిపోయా రు. వీరిలో కొందరు సంయమనం పాటిస్తున్నారు. మరికొందరు మాత్రం అంతర్గత చర్చల్లో జగన్ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. ఈ బాధ తట్టుకోలేకే... ఇటీవల పులివెందులకు వెళ్లినా.. జగన్ రెండు రోజులు కూడా ఉండలేక బెంగళూరుకు వెళ్లారు ఇక, ఇప్పుడు ఆయన ఫ్రెష్గా వస్తున్నా.. సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి.