ఏపీ: డిప్యూటీ స్పీకర్ విషయంలో ఇంకా సస్పెన్స్?

Suma Kallamadi
తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్ (ఉప సభాపతి) ఎవరనేది తేల్చకుండానే అసెంబ్లీ సమావేశాలు ముగించేశారు అనే విమర్శలు వినబడుతున్నాయి. అయితే రానున్న శాసన సభ సమావేశాల్లోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి మరి. కానీ ఇపుడు సర్వత్రా డిప్యూటీ స్పీకర్ పదవిని ఎందుకు హోల్డ్ లో పెట్టారు అనే విషయంపైన రాజకీయ వర్గాల్లో వాడివేడిగా చర్చ నడుస్తోంది. సాధారణంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదు. స్పీకర్ పదవి టీడీపీ నేతకు దక్కడంతో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీలో ఒకరికికి ఇస్తారనే టాక్ బయట వినిపిస్తోంది.

అయితే, కూటమి ప్రభుత్వంలో జనసేనకు కీలకమైన మంత్రిత్వ శాఖలు దక్కడంతో తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలంటూ బీజేపీ కోరుకున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అదే సమయంలో జనసేన నుంచి లోకం మాధవి పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఇలా కూటమి పార్టీలో ఎవరికి ఈ పదవి అప్పగించాలన్న దానిపై ఉన్న సందేహంపైనే డిప్యూటీ స్పీకర్ పదవిని హోల్డ్ లో పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్పీకర్ చైర్‌ టీడీపీకి దక్కింది, డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షాలకు ఇస్తారా లేదంటే దాన్ని కూడా టీడీపీలో ఎవరికన్నా ఒకరికి కట్టబెడతారా అన్నది ఇపుడు పెద్ద చర్చగా మారింది.
ఇటువంటి తరుణంలో రాయదర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులుకు డిప్యూటీ దక్కే చాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీనివాసులు టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. అదేవిధంగా జనసేనకి సంబంధించి ఓసీ సామాజిక వర్గానికి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి ఇస్తారనేది మరో టాక్. ఇక పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకు చీఫ్ విప్ దక్కే అవకాశం ఉన్నట్లు సభ్యుల మధ్య చర్చ నడుస్తోంది. మరి చిట్టచివరకు ఎవరికి దక్కుతుందో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: