రాముడికి హనుమంతుడిలా.. పవన్ వెనుక ఆ ఒక్కడు?

praveen

- పవన్ ఏజెండాను బలంగా నమ్మిన నాదెండ్ల
- ప్రతి కష్టంలో నేనున్నా అంటూ హామీ
- పవన్ తర్వాత జనసేనకు ఆయనే నెక్స్ట్ బాస్
(ఏపీ - ఇండియా హెరాల్డ్ )
సినిమాలను వదిలి జనాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వగలరా అనే అనుమానం ఎంతో మందిలో ఉండేది. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ ఉండడంతో పవన్ కి అంత సీన్ లేదు అనుకున్న వారు కూడా చాలామందే. కానీ ఇప్పుడు రాజకీయాల్లో రాణించలేరు అనుకున్న ఆ పవన్ కళ్యాణ్.. ఏకంగా ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారిపోయాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలలో పోటీ చేస్తే అన్ని చోట్ల భారీ విజయాలను సాధించి 100% స్ట్రైక్ రేట్స్ సాధించారు. ఒకరకంగా మొదటి గెలుపుతోనే తాను తిరుగులేని రాజకీయ నాయకుడిని అవుతాను అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశాడు.

 అయితే జనసేన పార్టీకి ఈ గెలుపు ఊరికే రాలేదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో విమర్శలు, ఎన్నో ఇబ్బందులు.. ఇవన్నీ ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు.  జనసేన పార్టీలో చేరి చివరికి పవన్ కళ్యాణ్ మోసం చేసి మరో పార్టీలోకి వలస వెళ్లిన నేతలు ఎంతోమంది. ఇలాంటి కష్ట సమయంలో కూడా రాముడికి హనుమంతుడిలా.. కృష్ణుడికి బలరాముడిలా.. కష్ట కాలంలో పవన్ కు తోడుంది మాత్రం ఒకే ఒక్కరు. ఆయనే నాదెండ్ల మనోహర్. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీనుండి గుంటూరు జిల్లా తెనాలి నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక కాంగ్రెస్లో డిప్యూటీ స్పీకర్ స్పీకర్గా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు నాదెండ్ల.  కానీ రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.

 దీంతో అప్పుడు ఫామ్ లో ఉన్న టిడిపిలోనూ లేదంటే వైసీపీలోనో చేరుతారని అందరూ అనుకుంటుండగా అనూహ్యంగా ఆయన 2018లో పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. కావాలనుకుంటే ఆయన మరో పార్టీలోకి వెళ్లొచ్చు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఇక విజయం సాధించె అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నాదెండ్ల మనోహర్ పవన్ ఎజెండాను బలంగా నమ్మారు. కష్ట కాలంలోనూ ఆయనకు తోడునీడగా నిలిచారు.

 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి ఒకవైపు నాదేండ్ల, మరోవైపు పవన్ కళ్యాణ్ ఓడిపోగా.. ఆ పార్టీ నుండి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఆ ఎమ్మెల్యే కూడా చివరికి జనసేనను మోసం చేసి వైసిపి తరఫున నిలిచారు. ఇలాంటి సమయంలో కూడా నాదెండ్ల పవన్ వెంటే ఉన్నారు. దీంతో ప్రస్తుతం జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా బాస్ ఉన్నారంటే అది నాదేండ్ల అనడంలో సందేహం లేదు. ఇక ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తెనాలి నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని అందుకోవడమే కాదు మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు నాదెండ్ల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: