మాజీ మంత్రి కామినేని కేసరపల్లికి డుమ్మా!.. అయ్యో పాపం..!
- సత్యకుమార్కు ఛాన్స్తో కామినేని , సుజనాకు షాక్
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు, టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. రాజకీయంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా చంద్రబాబును సమర్థించే బీజేపీ నాయకుల్లో కామినే ని ఒకరు. 2014లో బీజేపీ-టీడీపీ కలిసిపోటీ చేసి విజయం దక్కించుకున్నప్పుడు కామినేనికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే.. ఏదో ఒక చిన్న శాఖను ఆయనకు అప్పగించేస్తే.. ఎవరూ కాదనరు. కానీ, చంద్రబాబు ఆయనపై అభిమానం చూపించారు.
ఈ క్రమంలోనేకీలకమైన వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. బీజేపీతో బంధం కొనసాగినన్నాళ్లూ.. చంద్ర బాబుకు కామినేనికి మధ్య బంధం అలానే సాగింది. ఇక, ఆ తర్వాత.. కూడా వీరి మధ్య సంబంధం ఉన్నా.. ఎప్పుడూ బహిర్గత పడలేదు. వైసీపీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా కామినేని చంద్రబాబు సరసన నిలుచున్నారు. ఇక, తాజాగా ఆయన బీజేపీ పక్షాన కైకలూరు నియోజక వర్గం నుంచి విజయం దక్కించుకున్నారు.
తాజాగా మంత్రివర్గంలోనూ కామినేనికి అవకాశం చిక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ, బీజేపీ అధిష్టానం.. సత్యకుమార్ యాదవ్ కు మొగ్గు చూపింది. ఇదిలావుంటే.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కామినేని రాలేక పోతున్నారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా గా కామినేని ఆసుపత్రిలోని బెడ్పై నుంచే ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. తాను రాలేక పోతున్నానని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని తెలిపారు.
తనకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఉన్నప్పటికీ.. అనారోగ్య కారణాలతో రాలేక పోతున్న ట్టు కామినేని చెప్పారు. తాను కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నానని. సీవియర్ ఇన్ ఫెక్షన్తో వైద్యం తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కారణంగానే తాను మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేక పోతున్నట్టు కామినేని చెప్పారు. అయితే మంత్రి వర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.