నేర్పుతో కూర్పు: సముచితంగా కొలువురిన బాబు కొత్త మంత్రి వర్గం..!
- ఐదేళ్లలో కష్టపడిన వాళ్లను వెతికి మరీ మంత్రులను చేసిన బాబు
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో కీలక నాయకుడు చంద్రబాబు తన టీంను ఎంచుకున్నారు. తాను మినహా 24 మందితో కేబినెట్ను ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో ప్రధానంగా 20 స్థానాలను టీడీపీకే ఉంచుకున్నారు. అంటే.. 20 మంది మంత్రులు టీడీపీ నుంచే ఎంపిక చేసుకున్నారు. మిగిలిన వాటిలో మూడు పదవులు జనసేనకు ఇచ్చారు. అదేవిధంగా ఒక సీటును బీజేపీకి కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే.. సముచిత రీతిలో పదవులు కల్పించారు.
ముఖ్యంగా చంద్రబాబు ఎప్పుడూ.. వీర విధేయతకు పెద్దపీట వేస్తారన్న పేరుంది. అదేవిధంగా కొన్ని కుటుంబాలకు కూడా ప్రాధాన్యం ఇస్తారన్న ముద్ర ఉంది. కానీ, ఈ సారి మాత్రం చంద్రబాబు వీటిని తుడిచి పెట్టేశారు. ఎక్కడా కుటుంబాల ప్రస్తావన రాకుండా..(కేవలం నారా లోకేష్కు ఇచ్చారు. ఇక్కడ కూడా.. ఆయన పాదయాత్ర చేయడంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పార్టీకి మేళ్లు చేశారు. దీంతో ఆయనకు అవకాశం ఇచ్చారు) విధేయత + కష్టానికి చంద్రబాబు పెద్దపీట వేశారు.
ఇదేసమయంలో కష్టపడేవాళ్లు ఎక్కడున్నా.. వెతికి పట్టుకుని మరీ.. పదవులు ఇవ్వడం.. తాజా కూర్పులో స్ఫస్టంగా కనిపించింది. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ఈ తరహా కేటాయింపునకు ఉదాహరణ. అదే సమయంలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు కూడా బీసీ కోటాలో టికెట్ ఇచ్చినా.. ఇక్కడ కూడా ఐదేళ్ల కష్టం కనిపించింది. అదే సమయంలో కేవలం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నార న్న ముద్ర నుకూడా చంద్రబాబు తుడిచేశారు.
అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా గత ఐదేళ్ల పాలనలో చోటు పెట్టని కురబ సామాజిక వర్గానికి తొలిసారి చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. ఇక, రెడ్ల నుంచి కూడా బలమైన నాయకులను తీసుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిలోనూ మూస విధానానికి స్వస్థి చెప్పారు. ఊహించని విధంగా పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికి ఈ సారి చంద్రబాబు ఛాన్స్ ఇవ్వడం ద్వారా.. కులాల్లోనూ.. తాను ఇచ్చే ప్రాధాన్యం మార్చుకున్నట్టు స్పష్టంగా కనిపించింది. మొత్తంగా చంద్రబాబు కేబినెట్ సముచితంగా కొలువుదీరుతున్న సంకేతాలను పంపించారు.