రాజకీయాల్లో అపర చాణిక్యుడు బాబు.. పాతికేళ్ల తర్వాత అక్కడ టీడీపీని గెలిపించాడుగా!

Reddy P Rajasekhar
2024 ఎన్నికల ఫలితాలు ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్ చేశాయి. రాష్ట్రంలో ఎప్పుడూ గెలవని ప్రాంతాలలో సైతం కూటమి సత్తా చాటింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి విజయ కేతనం ఎగురవేయడం కూటమి అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరులో దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత టీడీపీ విజయం సాధించింది.
 
కోడుమూరు నియోజకవర్గంలో 39 సంవత్సరాల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ కంచుకోటలు అయిన నియోజక వర్గాలు సైతం ఈ ఎన్నికల ఫలితాలతో కూటమి కంచుకోటలు అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన వాళ్లు ఆయన అపర చాణిక్యుడు అని వ్యూహాల విషయంలో బాబుకు తిరుగుండదని చెబుతుంటారు. వైసీపీకి వ్యతిరేకంగా అన్ని ప్రధాన పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొనిరావడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
 
సీట్ల పంపిణీలో సైతం టీడీపీ నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. జనసేన తరపున కొంతమంది టీడీపీ నేతలను పోటీ చేయించి జనసేన బలం పెరగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బాబు కారణమయ్యారు. పోటీ చేసిన 90 శాతం పైగా స్థానాల్లో పార్టీని గెలిపించి కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కూటమికి ప్రత్యేక గుర్తింపును తీసుకొనిరావడం బాబుకే సాధ్యమైంది. టీడీపీ, జనసేనలతో పొత్తు వల్ల రాష్ట్రంలో బీజేపీ సైతం పుంజుకుంది.
 
కమలం గుర్తు పెద్దగా పరిచయం లేని నియోజకవర్గాల్లో సైతం బీజేపీ సత్తా చాటిందంటే అందుకు చంద్రబాబే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ తరపున కూడా బలమైన నేతలను పోటీ చేయించి గెలిపించడం చంద్రబాబు చాణక్యతకు నిదర్శనమని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైనా రాష్ట్రంలో పార్టీ ఇంత వేగంగా పుంజుకోవడం బాబు వల్లే సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబును తక్కువగా అంచనా వేసిన వాళ్లు ఇప్పుడు ఆయన తెలివితేటలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: