ఉంగుటూరు : జనసేన ధర్మరాజు రారాజుగా గెలిచాడు... గ్రేట్ విక్టరీ..!
2014లో టీడీపీ గన్ని వీరాంజనేయులు చేతిలో ఓడిన వాసు బాబు.. 2019లో ఆయనపై విజయం సాధించారు. అయితే ఈ సారి జనసేన అభ్యర్థిని ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. ఉంగుటూరు నియోజకవర్గం.. కాపు సామాజిక వర్గానికి పెట్టని కోట. నియోజకవర్గంలో ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాలు ఉన్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతం కూడా కొంతవరకు విస్తరించి ఉంది.
జనసేన పోటీ చేసిన నియోజకవర్గ కావడంతో పాటు.. ఆ పార్టీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బరిలో నిలిచిన ఏకైక క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత ధర్మరాజు కావడంతో కమ్మ, కాపు రాజులతో పాటు పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు బలంగా పనిచేశారు. అయితే అనూహ్యంగా ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన వాసు బాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో.. కాస్త ఆసక్తికర పోరు జరిగిందనే చెప్పాలి. జనసేనకు కాస్త ఆధిక్యం ఉన్నా.. కాపులు వాసు బాబుకు ఓటేశారా అన్న సందేహాలు కూడా పోలింగ్ టైం లో వ్యక్తం అయ్యాయి.
అయితే ఫైనల్ గా గెలుపు మాత్రం జనసేన ధర్మరాజునే వరించింది. ఆయనకు ఏకంగా 45000 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. జనసేన ఉంగుటూరు ఈ రేంజ్లో సౌండ్ చేసి గోదావరిని కేక పెట్టించేసింది.