ఎన్నికల కౌంటింగ్: ఉత్కంఠ రేపుతోన్న కడప.. గెలుపెవరిది?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి అందరిదృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాలు ఉన్నాయి.వాటిలో కడప లోక్ సభ స్థానం కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ త్రిముఖపోటీ నెలకొంది. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేదానిపై గందరగోళ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, వైఎస్ కుటుంబానికి కడప నియోజకవర్గం సొంతమైపోయిన పరిస్థితి చాలా సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు అక్కడ వైఎస్ కుటుంబం నుంచి ఏకంగా ఇద్దరు పోటీలో ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీచేసిన అభ్యర్థులు ఈ అంశంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. దీనినే హైలైట్ చేస్తూ ప్రచారం చేశారు. ఇక్కడ వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పోటీలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి భూపేష్‌రెడ్డి పోటీలో నిలిచారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం అవినాష్ రెడ్డి, షర్మిల మధ్యనే ఉన్నాయి. సీఎం జగన్ కడప నుంచి అవినాష్ రెడ్డిని గెలిపించాలి అంటూ గట్టిగానే ప్రచారం చేశారు.



షర్మిలను ఎలాగైనా గెలిపించాలని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ప్రచారంలో జోరుగా తిరిగారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అమెరికాలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి.. స్వయంగా షర్మిలను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే అవినాష్ రెడ్డి గెలుపు ఇక్కడ నల్లేరుపై నడకే అని మొదట్లో అందరూ కూడా అనుకున్నారు. కానీ, షర్మిల ఎంట్రీతో పరిస్థితి పూర్తిగా మారింది. పైగా దానికి తోడుగా వైఎస్ విజయమ్మ చేసిన విజ్ఞప్తి పరిస్థితిని మార్చేసింది. దీంతో అవినాష్ రెడ్డి.. షర్మిల మధ్య పోటీ నువ్వానేనా అనే రీతిలో తయారైంది. అవినాష్ రెడ్డి కారణంగానే తన తండ్రి చనిపోయారంటూ వివేకానంద రెడ్డి కుమార్తె పదే, పదే ఆరోపణలు చేస్తూ షర్మిలకు అనుకూలంగా ఆమెని సపోర్ట్ చేస్తూ షర్మిలకు ఓటు వేయాలంటూ నిర్వహించిన ప్రచారం ఇక్కడ గట్టిగా ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.మొత్తమ్మీద కడప గడపలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉంది. కడపలో వైఎస్ జగన్ ప్రతిష్టకు.. షర్మిల పోరాటానికి మధ్య ఓటరు ఎవరికీ పట్టం కడతారు అనేది కొద్దిగంటల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: