కౌం ' ట్రిక్స్ ' : బ్యాలెట్ భద్రమా.. ఈవీఎం భద్రమా..!
- ఈవీఎంల ట్యాంపరింగ్పై చాలా డౌట్లు ఉన్నాయ్
- ఖర్చు, సమయంతో పోలిస్తే ఈవీఎంలే బెటర్
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
ఈ ప్రశ్న తరచుగా వినిపిస్తూనే ఉంది. అంతేకాదు.. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు.. అనేక పార్టీలు దీనిపై చర్చించి.. ఏకంగా సుప్రంకోర్టును కూడా ఆశ్రయించాయి. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని.. బ్యాలెట్ పత్రాలతో ఓట్లు జరిపించేలా ఆదేశించాలని కోరాయి. అయితే.. అనేక రోజుల విచారణల అనంతరం సుప్రీంకోర్టు..ఈ పిటిషన్లలను తోసిపుచ్చింది. ఎలక్ట్రానిక్ ఓట్ల యంత్రాలపైనా.. ఎన్నికల సంఘంపైనా నమ్మకం ఉంచాలని వ్యాఖ్యానించింది. ఈ నమ్మకమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనేది పార్టీలు చెబుతున్న మాట.
బ్యాలెట్ అయితే.. స్పష్టంగా పెద్ద అక్షరాలతో కూడి ఉంటుంది. దీంతో ఓటర్లు ఎలాంటి తర్జన భర్జన లేకుండా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్నది పార్టీలు చెబుతున్న మాట. అంతేకాదు.. వీటిని ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం లేదు. అయితే.. ఇక్కడ కూడా ప్రధాన సమస్య ఉంది. అసలు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో కొన్ని చోట్ల దశాబ్దం కిందట రీపోలింగ్ జరిగిన ఘటనలు కూడా కనిపించాయి. పైగా వ్యయంతో కూడిన వ్యవహారం కావడం, భద్రత పరంగా.. సమయం పరంగా కూడా.. బ్యాలెట్ బాక్సులకు ఎక్కవ ఖర్చు. అందుకే ఈవీఎంలను ప్రవేశ పెట్టారు.
ఈవీఎంలను గమనిస్తే.. ఇక్కడ ట్యాంపరింగ్కు అవకాశం ఉందనే వాదన ఇప్పటికీ ఉంది. అంటే.. ఈవీఎంలో వేసే ఓటు ఒక గుర్తుపై వేస్తే.. అది మరో గుర్తుపై ఆటోమేటిక్గా పడిందనే వీడియోలు కూడా.. ఈ ఎన్నికలకు ముందు హల్చల్ చేశాయి. అంతేకాదు.. 2019 ఎన్నికల సమయంలో అయితే.. రష్యా సాంకేతికత వినియోగించి.. స్పైవేర్ ద్వారా.. ఈవీఎంలలో నిక్షిప్త మైన ఓట్లను మార్చేశారని కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయి. అప్పట్లో ఇది పెను వివాదానికి కూడా దారి తీసింది. అంటే.. ఉదాహరణకు సైకిల్ గుర్తుపై ఎవరైనా ఓటేస్తే.. అది ఈవీఎంలో అలానే కనిపిస్తుంది.
కానీ, వీవీ ప్యాట్లో ముద్రితమయ్యే.. స్లిప్పులో మాత్రం ఫ్యాన్ను చూపిస్తుంది. ఇది ఒకరమైన ఆరోపణ. కానీ, ఇది నిజం కాదని.. కొందరు మాన్యుప్యులేట్ చేశారని.. ఎన్నికల సంఘం అప్పట్లో వివరణ ఇచ్చింది. ఇక, ఈవీంఎంలను ఎక్కడ నుంచి అయినా.. మేనేజ్ చేయొచ్చన్న వాదన కూడా ఉంది. ఇది సాధ్యమేనా? అన్నది కూడా ప్రశ్న. ఎందుకంటే.. ఈవీఎంలలో `చిప్`లను వినియోగిస్తారు. వీటిని ఎక్కడి నుంచి అయినా.. మేనేజ్ చేయొచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అయితే.. దీనికి తగిన ఆధారాలు మాత్రం లేవు. సో.. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం దాదాపు సాధ్యం కాదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో రెండు విధానాలు బెటరే అయినా.. ఖర్చు, సమయంతో పోల్చుకుంటే.. ఈవీఎంలే బెటర్ అని ఎన్నికలసంఘం చెబుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ విధానంలో పోలింగ్ జరిగింది.