కన్నీటి ఆంధ్రప్రదేశ్ : ఈ 7 జిల్లాల్లో ప్రజల కన్నీటి ఘోష ఇంత దారుణంగానా..?
- విభజన చట్టం హామీలు కేంద్రం తుంగలో తొక్కినా అడగలేని జగన్, బాబు..!
- వెనకపడ్డ జిల్లాలకు జూన్ 2తో తీరిన పదేళ్ల గడవు.. !
( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్న కీలక సమస్య.. వెనుకబడిన జిల్లాలు! వీటిలో మొత్తం ఉమ్మడి 7 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, సీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, కోస్తాలోని ప్రకాశం. ఈ ఏడు జిల్లాలను కూడా.. వెనుకబడిన జిల్లాలుగా కేంద్రమే ప్రకటించింది. ఇది జరిగి రెండు దశాబ్దాలు అయిపోయింది. మధ్యలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా.. ఈ విషయం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఈ జిల్లాలకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇస్తోంది కూడా.
అసలు వెనుక బడిన జిల్లాలు అంటే.. ఆయా జిల్లాల్లోని ప్రజలకు ఉపాధి లేకపోవడం.. రైతాంగానికి.. సాగు నీరు అందకపోవడం.. జీడీపీలో చాలా వెనుకబడి ఉండడం.. తలసరి ఆదాయంలోనూ వెనుకబడి ఉన్న పౌరులు జీవించడం.. వాణిజ్య, వ్యాపార రంగాల కార్యాకలాపాల్లోనూ ఆయా జిల్లాల పరిస్థితి దారుణంగా ఉండడం. అందుకే వీటిని వెనుకబడిన జిల్లాలుగా పేర్కొంటారు. వీటిని డెవలప్ చేసేందుకు.. విభజన చట్టంలోనే ఒక్కొక్క జిల్లాకు.. రూ.700 కోట్ల చొప్పున పదేళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు.. మొత్తంగా అందిన సొమ్ము ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఒక్కొక్క జిల్లాకు ఏటా 30-40 కోట్లు మాత్రమే. అయితే.. ఆయా నిధులను కూడా.. ప్రభుత్వాలు.. సరిగా ఖర్చుచేయలేదని..కేంద్రం ఇతర నిధులు ఇవ్వడం ఆపేసింది. వాస్తవానికి కేటాయించిన పనులకు ఆయా నిధులను ఖర్చు చేసి ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేది. కానీ.. ప్రబుత్వాల్లో చిత్తశుద్ది లోపం.. సదరు నిధులను పథకాలకు కేటాయించ డం.. కారణంగా.. ఆయా జిల్లాలు ఇప్పటికి కరువు కోరల్లోచిక్కుకుని ఉన్నాయి.
ఆయా జిల్లాల్లోని యువత పొరుగు రాష్ట్రాలకు.. జిల్లాలకు పోయి.. ఉపాధిని వెతుక్కుంటున్నారు. సరే.. ఇప్పుడున్న పరిస్థితిలో వచ్చే సర్కారు అయినా.. వాటికిమేలు చేస్తుందా? అంటే.. కష్టమే. ఎందుకంటే.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పదేళ్ల పాటు మాత్రమే కేంద్రం సాయం చేస్తామని చెప్పింది. ఆ పదేళ్లు రేపు వచ్చే జూన్ 2తో తీరిపోనుంది. దీంతో కేంద్రం నుంచి సాయం అందడంఅనేదికష్టమే. దీంతో ఈ వెనుక బడిన జిల్లాల పరిస్థితి అలానే ఉంటుందా? లేక మార్పు వస్తుందా? అనేది చూడాలి.