ఓటరు స్లిప్పులు రాలేదా.. ఏం చేయాలి..?
- నియోజకవర్గం, ఫోన్ నెంబర్ టైప్చేస్తే అరచేతిలో స్లిప్పులు
- ఏ గుర్తింపు కార్డుతో అయినా రిలాక్స్గా ఓటేసేయండి..
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
మరో రెండు రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 13న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మందికి పైగా ఓటర్లకు.. ఎన్నికల సంఘం స్లిప్పులు పంపిణీ చేసింది. ఇదేసమయంలో పార్టీలు కూడా.. ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తున్నాయి. ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన ఓటర్లకు ఈ స్లిప్పులు అందిస్తున్నారు.
అయితే. ఏదైనా కారణంతో ఓటరు స్లిప్పులు రాకపోతే ఏం చేయాలి? అనేది చాలా మంది సందేహం. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అరచేతిలోనే స్లిప్పులు తీసుకునే విధంగా సీ విజిల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేవిధంగా ఏపీసీఈవో అనే సైట్ను కూడా తీసుకువచ్చింది. వీటలో ఏదో ఒక దానిని ఎంచుకుని.. ఓటరు స్లిప్పులు పొందవచ్చు. దీనికి కావాల్సినవి.. కేవలం మీ నియోజకవర్గం, మీ ఫోన్ నెంబరు వివరాలు తెలిస్తే చాలు.
సీవిజిల్ లేదా ఏపీసీఈవో యాప్లలో ఓటరు స్లిప్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. తర్వాత.. రాష్ట్రం, నియోజకవర్గం, మీ ఫోన్ నెంబర్లను ఎంటర్ చేసి.. మీ పేరును కూడా ఎంటర్ చేస్తే.. చాలు.. వెంటనే స్లిప్పు కనిపిస్తుంది. దీనిలో అన్ని వివరాలు ఉంటాయి. మీ పేరు, తండ్రి/ భర్త పేరుతోపాటు.. చిరునామా కూడా ఉంటాయి. ఇక, ఎక్కడ ఓటేయాలో.. పోలింగ్ బూత్ నెంబరు ఏంటో.. మీరు ఓటేసే బూత్ ఏ దిశలో ఉందో వంటివివరాలు కూడా కనిపిస్తాయి.
దీనిని తక్షణమే డౌన్ లోడ్ చేసుకుని.. కుదిరితే ప్రింట్ తీసుకోవచ్చు.. లేదా పీడీఎఫ్ కాపీనైనా భద్ర పరుచుకోవచ్చు. సదరు స్లిప్పులో పేర్కొన్న విధంగా అడ్రస్కువెళ్లి.. దీనిని చూపించాలి. దీంతోపాటు ఏదైనా గుర్తింపు కార్డు.. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డు.. వంటివి ఫొటో ఉన్న గుర్తింపు కార్డులను తీసుకువెళ్లి.. ఓటు వేయొచ్చు. సో.. ఓటరు స్లిప్పు రాలేదన్న చింత తీరుతుంది.