జనసేన వర్సెస్ మహాసేన.. పవన్ అంటే ఇంత లైట్ అయిపోయాడా..?
మహాసేన రాజేష్గా పాపులర్ అయిన.. రాజేశ్వరరావు(ఎస్సీ సామాజిక వర్గం మాదిగ).. ఆది నుంచి వైసీపీలో ఉన్నారు. 2019లో మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీకి వీడ్కోలు పలికారు. అనంతరం.. ఆయన జనసేన పార్టీకి అండగా ఉన్నారు. తర్వాత..వైసీపీకి యాంటీ అయ్యారు. కానీ, ఇంతలోనే.. టీడీపీ ఆయనకు పి.గన్నవరం(ఎస్సీ) నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే.. ఆయన నియామకంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో కొన్ని రోజులు వేచి చూసిన చంద్రబాబు ఆయనను తప్పించి.. ఈ టికెట్ను ఏకంగా.. జనసేనకు ఇచ్చారు.
ఆ తర్వాత.. నుంచి రాజేష్ కొన్ని రోజులు బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో యూటర్న్ తీసుకున్నారు. టీడీపీపైనే సెటైర్లు వేయడం ప్రారంభించారు. పొత్తులు నిలవవని.. పార్టీ అధినేతే తప్పులు(చంద్రబాబు) చేస్తున్నారని.. అసలు బీజేపీతో ఎందుకు చేతులు కలిపారో వారికైనా తెలుసా? అని ప్రశ్నించారు. అనంతరం.. జనసేన అధినేత పవన్కు కూడా ఎదురు గాలి వీస్తోందని.. వైసీపీ వ్యూహాలను కూటమి తట్టుకోలేదని.. వీరు మంది కలిసినా.. అక్కడ వైసీపీ ముందు చివురుటాకుల్లా వణికి పోతున్నారని రాజేష్ వరుస వీడియోలు పెట్టారు. అయినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో ఇప్పుడు అనూహ్యంగా రాజేష్ టంగ్ మార్చేశారు. ముస్లింల రిజర్వేషన్ 4 శాతంపై వైసీపీ అధినేత జగన్ మగాడుగా నిలబడి.. ప్రచారం చేస్తున్నారని.. కులాలను కాపాడుకుంటాననిఅంటున్నారని.. ఆ తెగువ, ధైర్యం జనసేనలో ఏదని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. పవన్ వంటి నాయకుడి వల్ల.. రాష్ట్రానికి మేలు కాదు.. కీడే ఎక్కువగా జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను , జనసేన పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారి అభ్యర్థులను కూడా ఓడించేందుకు మహాసేన పనిచేస్తుందని అన్నారు. పవన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని చెప్పారు.
కట్ చేస్తే.. మహాసేన ఎఫెక్ట్ ఎంత? అది జనసేనను హెచ్చరించడం.. వంటివి రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే.. నిన్న మొన్నటి వరకు కూడా.. బాగానే ఉండి.. ఇప్పుడు ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇలా వ్యవహరించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. టీడీపీ నుంచి జనసేన నుంచి ఆయనకు ప్యాకేజీ అందకపోవడమే కారణమని రాజకీయ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. చంద్రబాబు.. ఆయనకు అప్పాయింట్మెంటు ఇవ్వకపోవడం..పదవులపై ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతోనే ఇలా వ్యూహాత్మకంగా గేర్ మార్చారని అంటున్నారు. ఇక, ప్రభావితం అయ్యే ఓట్లు ఏమైనా ఉన్నాయా? అంటే.. లేవని జనసేన వర్గం చెబుతోంది. కానీ, యువత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా.. పవన్ను బెదిరించడం ఎంత వరకు సమంజసం అనేది కీలక విషయం.