నెల్లూరు రూరల్‌: కోటంరెడ్డి వర్సెస్‌ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.. ఎడ్జ్‌ ఎవరికి ఉందంటే?

Chakravarthi Kalyan
నెల్లూరు రూరల్‌లో రెడ్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ వైసీపీ తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి కాగా.. టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. అయితే ఈ నెల్లూరు రూరల్‌ పోరులో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఇక్కడ టీడపీ నుంచి బరిలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మొదటి నుంచి జగన్‌ భక్తుడిగా పేరు ఉన్న వ్యక్తి. జగన్‌ను విపరీతంగా అభిమానించే అనుచరుడిగా గుర్తింపు పొందారు.

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచారు. ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న వ్యక్తి. 2019లో వైసీపీ నుంచే ఆయన గెలుపొందారు. అయితే జగన్‌తో కొన్నాళ్లుగా విబేధాలు తలెత్తిన నేపథ్యంలో ఆయన ఎన్నికలకు ఒక ఏడాది ముందే వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆయన ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ వైసీపీ నుంచి బరిలో ఉన్న ఆదాల ప్రభాకర్‌ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా గతంలో టీడీపీలో ఉన్న నాయకుడే..  2019లో ఎన్నికల ముందు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చాడు. ఈ ఇద్దరు నేతల్లో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మాస్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్నాడు. జనంలోకి చొచ్చుకెళ్లే స్వభావం కలిగిన వ్యక్తి. ఇక ఆదాల ప్రభాకర్‌ రెడ్డి క్లాస్‌ లీడర్‌ అని చెప్పుకోవాలి.

ఇక ఈ నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో నెల్లూరు రూరల్ మండలంతో పాటు నెల్లూరులోని 20 డివిజన్లు కూడా దీని పరిధిలోకే వస్తాయి. ఇద్దరూ బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో పోరు హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ హోరా హోరీ పోరులో ప్రస్తుతానికి కూటమి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే కాస్త ఎడ్జ్‌ ఉన్నట్టు ఇండియా హెరాల్డ్‌ గ్రౌండ్‌ రిపోర్టు చెబుతోంది. చూడాలి మరి ఎవరు గెలుస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: