ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో టిడిపి కూటమి వైసిపి మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఏర్పడింది. నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి మాత్రమే గెలుస్తుందని భావిస్తున్నారు. కానీ అనూహ్యంగా చీరాలలో కాంగ్రెస్ పార్టీ కూడా తెరపైకి వచ్చింది. తెరపైకి రావడమే కాదు టిడిపి వైసిపికి చుక్కలు చూపించే నేత బరిలో ఉన్నారు. ఆయన ఎవరయ్యా అంటే ఆమంచి కృష్ణమోహన్. కొనిజెటి రోశయ్య శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఈసారి చీరాల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. వీరి గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం..
ఆమంచి కృష్ణమోహన్ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ పార్టీ ద్వారా పోటీ చేసి టిడిపి అభ్యర్థి కరణం బలరామకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటినుంచి ఆయన నియోజకవర్గంలోనే ఉంటూ వచ్చారు. కానీ ఆయనను వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్చూరు నియోజకవర్గానికి ఇన్చార్జిగా పంపారు. కానీ చివరికి ఆ టికెట్ కూడా ఆమంచికి ఇవ్వకపోవడంతో ఆయన తిరుగుబాటు చేశారు. చీరాలలో ఎలాగైనా పోటీ చేయాలనుకున్నారు. ఏ పార్టీ అయితే బాగుంటుందని ఆలోచించి తన పాత క్యాడర్ అయిన కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నారు. ఇదే తరుణంలో కరణం వర్గీయులకు మరియు ఆమంచికి మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది.
కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్, టిడిపి నుంచి మాలకొండయ్య యాదవ్, వైసిపి నుంచి కరణం వెంకటేష్ పోటీ చేస్తుండడంతో చీరాలలో త్రిముక పోరు ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోని వెంకటేష్, మాలకొండయ్య ఆ నియోజకవర్గంలో కొత్త నాయకులు. కానీ ఆమంచి నియోజకవర్గంలో అణువణువు తెలిసిన వ్యక్తి. అంతేకాకుండా ఆయనకు పలుమార్లు గెలిచిన అనుభవం కూడా ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో పార్టీలను చూడకుండా వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ తరుణంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఈసారి గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.