ప్రస్తుతం రాష్ట్రంలో రాళ్ల రాజకీయం నడుస్తోంది. ఎన్నికల సమీపిస్తున్న కొలది రాజకీయ నాయకులు రంగులు మారుస్తున్న ఊసరవెల్లిలా రకరకాల రాజకీయాలు చేస్తూ కార్యకర్తలను ఉసి గొలుపుతున్నారు. ఇంత పెద్ద నేతలపై దాడి చేసేది ఎవరో తెలియదు కానీ పార్టీలో పనిచేసే కార్యకర్తల మధ్య మాత్రం విపరీతమైనటువంటి కక్షలు పెరుగుతున్నాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి లీడర్ల వరకు ఈ రాళ్ల రాజకీయంపై విపరీతమైనటువంటి చర్చ చేస్తున్నారు. ఇక గ్రామాల్లో అయితే చాలామంది టీడీపీ, వైసీపీ కార్యకర్తలు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. వీటన్నింటికీ కారకులెవరు.. రాళ్లదాడి ఎక్కడికి దారితీస్తుంది అనేది చూద్దాం.
విజయవాడ బస్సు పర్యటనలో భాగంగా జగన్ పై రాళ్ల దాడి జరిగి జగన్ కంటి భాగంలో గాయమైంది. ఇది కాస్త జాతీయస్థాయిలో పెద్దగా చర్చకు దారితీసింది. దీనిపై టిడిపి నాయకులు ఏమో కోడి కత్తి డ్రామా లాగా ఇదొక రాళ్ల దాడి డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక వైసిపి పార్టీ వాళ్లు మా ప్రజాధరణ ఓర్వలేక టిడిపి వాళ్ళు రాళ్లదాడి చేయిస్తున్నారని అంటున్నారు. ఇక జగన్ పై దాడి మరువక ముందే మరోసారి చంద్రబాబుపై మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్ల దాడి జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాళ్లదాడి చర్చే ఎక్కువైపోయింది. దీంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోయిందని చెప్పవచ్చు.
ఇలా ఒక్కరోజు తేడాతో ముగ్గురు బిగ్ లీడర్లపై రాళ్ల దాడులు జరగడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతిరోజు 175 నియోజకవర్గాల్లో చాలామంది నాయకులు పర్యటన చేస్తున్నారు. వారిపై జరగని రాళ్లదాడి ఈ బిగ్ లీడర్లపై మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలామంది ఆలోచన చేస్తున్నారు. ఇదంతా కావాలని చేస్తున్నారా, ఈ రాళ్లదాడి పేరుతో కార్యకర్తలను రెచ్చగొడుతున్నారా అనే అనుమానం కూడా రేకెత్తిస్తున్నాయి. జనాలను అట్రాక్ట్ చేయడం కోసం రాళ్లదాడి పేరుతో కొత్త తతంగం మొదలుపెట్టారని దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉంటుందని ప్రజాస్వామ్య ప్రియులు ఆరోపిస్తున్నారు.