గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారుతుంది. 2019కి ముందు టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం లెక్కలు మారుతున్నాయి. వార్ వన్ సైడే అన్నట్టుగా తయారవుతోంది. ఇక్కడ వైసిపి గెలిచే సీటును చేతులారా పాడు చేసుకుంటుందా.? టీడీపీ తన కంచుకోటలో మళ్లీ జెండా ఎగరవేయబోతోందా..? రావి ఎంట్రీతో వైసీపీలో వణుకు పుడుతుందా.? పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. పొన్నూరు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి నరేంద్ర పోటీ చేశారు. అలాగే వైసిపి నుంచి కిలారు రోశయ్యను బరిలో ఉంచి విజయం సాధించారు.
అయితే కిలారు వెంకట రోశయ్య అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత క్యాడర్ అంతా విడిపోయిందట. వైసిపికి సంబంధించిన కార్యకర్తలు ఇతర సీనియర్ నాయకులకు కిలారు రోశయ్యకు మధ్య వాగ్వాదం ఏర్పడి గందరగోల వాతావరణం ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో ఈసారి కిలారును గుంటూరు ఎంపీగా పంపి, ఆయన స్థానంలో అంబటి రాంబాబు తమ్ముడు అంబటి మురళీకృష్ణను బరిలోకి దించింది. గత పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి ఆ సీనియర్ నేతకు మొండి చేయి చూపించింది. దీంతో ఆ సీనియర్ నేత వైసిపికి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఆ నాయకుడు ఎవరయ్యా అంటే రావి వెంకటరమణ. ఈయన వైసీపీకి చాలా రోజుల నుంచి సేవలు అందిస్తున్నారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వెంకటరమణకు పొన్నూరులో మంచి పట్టు ఏర్పడింది. 2019లో తనకు వైసిపి టికెట్ ఇస్తుందని ఆశపడ్డాడు. కానీ అనూహ్యంగా కిలారు రోశయ్యకు కట్టబెట్టడంతో ఆయన విజయం సాధించారు. రోశయ్య ఎప్పుడైతే పొన్నూరులోకి ఎంట్రీ ఇచ్చారో, అప్పటినుంచి రావిపై కన్నెర్ర చేసి దూరం పెడుతూ వచ్చారు. ఈ విధంగా వైసీపీలో పొన్నూరు నియోజకవర్గంలో వర్గాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా రోశయ్యని ఎంపీ అభ్యర్థిగా పంపిన వైసిపి, అంబటి మురళీకృష్ణ కి టికెట్ ఇచ్చింది.
ఈసారి కూడా టికెట్టు ఇస్తుందని ఆశపడిన రావికి మొండి చేయి చూపించడంతో ఇండిపెండెంంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఒకవేళ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మాత్రం వార్ వన్ సైడ్ అవుతుంది. బలమైన నేత ధూళిపాళ్ల నరేంద్ర విజయం తప్పకుండా ఖరారు అవుతుంది. ఎందుకంటే 1994 నుంచి వరుసగా ఐదు సార్లు ఆయన టిడిపి నుంచి గెలుపొందారు. మంచి పట్టున్న నాయకుడు కాబట్టి ఆయన ముందు వైసిపి వాళ్లు నిలబడడమే కష్టం. అలాంటిది సమన్వయ లోపం వచ్చింది కాబట్టి నరేంద్ర విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.