టెక్క‌లిలో అచ్చెన్నాయుడు మెజార్టీ భారీగా పెంచేసిన జ‌గ‌న్‌... థ్యాంక్స్ చెప్పాల్సిందే..!

RAMAKRISHNA S.S.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగినది. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 1994లో విజయం సాధించారు. టెక్కలి టికెట్టుకు అంత ప్రాముఖ్యం ఉంది. 2014 - 2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం తరఫున అచ్చెంన్నాయుడు గెలిచినా వైసీపీ, టీడీపీ మధ్య భీకర పోరు కొనసాగింది. ఏపీ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న మాజీ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు వరుసగా రెండుసార్లు గెలిచారు. ఇప్పుడు 2024 లో వరుసగా మూడోసారి విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈసారి అచ్చం నాయుడును ఎలాగైనా ఓడించాలని వైసీపీ ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని పోటీకి పెట్టింది. ఇక్కడ ఇదే సీటు కోసం పోటీలో ఉన్న పేరాడ తిలక్‌కి శ్రీకాకుళం ఎంపీ సీటు ఇచ్చింది. అయితే ఈ ఇద్దరిని సర్దుబాటు చేసినా వైసీపీ.. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి మాత్రం ఝులక్ ఇచ్చింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఆమె వైసీపీలో చేరి ఎంపీ సీటు ఆశించారు. ఆ త‌ర్వాత ఆమెకు రాజ్య‌స‌భ సీటు ఇస్తామ‌ని ఆశ‌లు పెట్టారు. ఏ సీటు ఇవ్వ‌లేదు. అస‌లు ఆమెకు జిల్లా వైసీపీ ప‌గ్గాలు ఎందుకు ? ఇచ్చారో ఎందుకు ప‌క్క‌న పెట్టారో తెలియ‌ద‌నే ఆమె వాపోయారు.

ఇక ఇప్పుడు ఆమెను పూర్తిగా డ‌మ్మీని చేసేశారు. దీంతో తీవ్ర అసంతృప్తి గురైన ఆమె.. పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆమె కాంగ్రెస్ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తారు అనుకుంటే.. ఆమెను టెక్కలి అసెంబ్లీ బరిలో దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. వాస్తవంగా అచ్చెంన్నాయుడును  ఎలాగైనా ఓడించాలని 2019 ఎన్నికలలో జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఇదే నియోజకవర్గానికి చెందిన దువ్వాడ శ్రీనుకు ఎంపీ సీటు, పేరాడ తిలక్‌కు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు సీట్లు అటు ఇటు మార్చారు.

కాలింగ సామాజిక వర్గంలో చీలిక తేవాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ అది వర్కౌట్ అయ్యేలా లేదు. కృపారాణి కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం విశేషం. టెక్కలిలో ఆమెకు కొంత ఓటు బ్యాంకు ఉంది. ఈసారి ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంకుకు చిల్లు పడుతుంది. నిన్నటి వరకు వైసీపీలో ఉన్న ఆమె ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళితే.. ఆమె వైసీపీ ఓట్లకు చాలావరకు గండి కొడతారనే చర్చలు నడుస్తున్నాయి.

ఆమె పోటీతో ఇద్దరు కలింగ అభ్యర్థుల మధ్య పోరుసాగి.. ఓట్లు ఎంతోకొంత చీలిపోతాయన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికే అచ్చం నాయుడు గెలుపు బాటలో ఉండగా.. కృపారాణి, జగన్ మీద కోపంతో వైసీపీని వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడంతో అచ్చెంన్నాయుడుకు మెజార్టీ మరింతగా పెరుగుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్ప‌టికే టెక్క‌లి వైసీపీని మూడు గ్రూపులుగా ముక్క‌లు చెక్క‌లు చేసి త‌న‌ను గెలిపించ‌డంతో పాటు ఇటు తన మెజార్టీ భారీగా పెంచుతున్నందుకు అచ్చన్న జగన్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలని చర్చలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: