తెలంగాణ: ఓటుకు నోటు కేసులో బాబుని ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌పై విచారణ నేడే!

Suma Kallamadi
ఓటుకు నోటు కేసు గురించి తెలియని జనాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరనే చెప్పుకోవాలి. అప్పట్లో ఈ కేసు ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. అదే కేసు చంద్ర‌బాబు నాయుడిని నీడ‌లా వెంటాడుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలోనే 2015లో కేసీఆర్ స‌ర్కార్‌ను ప‌డ‌గొట్టేందుకు చంద్ర‌బాబు అనేక కుట్ర‌లు చేశారనే విమ‌ర్శ వుంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్ర‌బాబు అప్పట్లో పెద్ద పథకమే వేశారు. ఇప్ప‌టి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అప్పట్లో టీడీపీలో కీల‌క పాత్ర పోషించిన సంగతి విదితమే. రేవంత్‌ను అడ్డం పెట్టుకుని నాటి సీఎం కేసీఆర్ స‌ర్కార్‌ను పడగొడదామని చంద్ర‌బాబు అడ్డంగా ఇరుక్కున్నారు. ఈ క్రమంలో నాడు రేవంత్‌రెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుపాలు చేసిన సంగతి విదితమే.
ఈ కేసులోనే చంద్ర‌బాబు నాయుడిని నిందితుడిగా చేర్చాల‌ని, అలాగే కేసు విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించాల‌న్న ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి వేర్వేరు పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచార‌ణ చేపట్టనున్నారు. ఈ కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణాలో ముఖ్య‌మంత్రి స్థానంలో ఉండడం వలన విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించాల‌న్న విజ్ఞప్తిలో అయితే ఫుల్ క్లారిటీ వుంది. ఈ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ సురేంద‌రేష్‌, జ‌స్టిస్ ఎస్వీఎన్ భ‌ట్టి ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్ట‌నుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున టీడీపీతో పాటు అన్ని రాజ‌కీయ ప‌క్షాలు సుప్రీంకోర్టు విచార‌ణ వైపు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి అనడంలో సందేహమే లేదు.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న మరో పిటిషన్‌పై కూడా ధర్మాసనం ఇవాలే విచారణ చేపట్టనుంది. ఇక, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు మాజీ సీఎం చంద్ర బాబు డబ్బులను ఎరగా చూపించడం ఈ ప్రపంచం అంతా చూసింది. ఈ సందర్బంగా 'మనోళ్లు బ్రీఫ్డ్ మీ' అనే వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ కూడా అప్పట్లో నిర్ధారించింది. అయితే, చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: