తెలంగాణ: ఈసారి ముస్లిం ఓటు ఎటువైపు?

Chakravarthi Kalyan
ఎప్పటి లాగే ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపోటములకు మైనార్టీ ఓటర్లు కీలకం కానున్నారు. అధిక స్థానాల్లో అభ్యర్థులు విజయానికి బాటలు వేస్తుండగా.. మరొకొన్ని స్థానాల్లో వారి ఓట్లు గెలుపోటములను తారుమారు చేస్తున్నాయి. మైనార్టీ ఓటర్లలో ముస్లిం ఓట్లే కీలకం. దీంతో ఎంఐఎం మద్దతు ఎటువైపు ఉంటే ఆ పార్టీనే విజయం సాధిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎంఐఎం మరోసారి ఆపార్టీకే ఓటు వేయాలని ముస్లింలను కోరింది.

దీంతో గతంలో లానే ఫలితాలు పునరావృతమవుతాయనే నమ్మకంతో బీఆర్ఎస్ ఉంది. అయితే కాంగ్రెస్ ముస్లిం, మైనార్టీలను ఆకర్షించే పనిలో పడింది. ఆరు గ్యారెంటీలు, మైనార్టీ డిక్లరేషన్ పై ఆ పార్టీ గట్టిగానే అంచనాలు పెట్టుకుంది. ఈ సారి ఈ ఓటర్లు ఎటువైపు ఉంటారో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు మినహా.. రాష్ట్రంలో 25-30 స్థానాల్లో ముస్లిం, మైనార్టీ ఓటర్లు గెలుపోటములును ప్రభావితం చేస్తారు.

అయితే గత ఎన్నికల్లో గులాబీ బాస్ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. నాలుగు నెలల్లోనే సాధిస్తామని వాగ్దానం చేశారు. ప్రస్తుతం దీని ఊసే లేదు. మరోవైపు మైనార్టీ రుణాలు, లక్ష సాయం, ఉర్దూ రెండో అధికారిక భాష, మైనార్టీలకు ఉద్యోగ అవకాశాలు ఇలా అనేక హామీలను విస్మరించారని ముస్లింలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అనే ప్రచారాన్ని కొంతమంది ముస్లింలు నమ్ముతున్నారు.

ముస్లిం ఓటర్లు సుమారు 80వేల మంది ఉన్న గోషామహల్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టకుండా.. జూబ్లిహిల్స్ లో పోటీ చేస్తున్న అజారుద్దీన్ పై అభ్యర్థిని బరిలో ఉంచారు. దీంతో ఎంఐఎం మాటలు కూడా నమ్మే పరిస్థితిలో ముస్లింలు లేరు. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో మైనార్టీలు కాంగ్రెస్ కు అండగా నిలిచారు. ఈ సారి కూడా బీఆర్ఎస్ పై వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ వైపే మైనార్టీ ఓటర్లు మొగ్గు చూపుతారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: