అమరావతి : జోగయ్యను పవన్ నమ్మితే అంతే సంగతులా ?
కాపు సంక్షేమ సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య జనసేన విషయంలో మొదటినుండి చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు. ఎలాగైనా సరే రాబోయే ఎన్నికల్లో జనసేనను గెలిపించి అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది జోగయ్య కోరిక. జోగయ్యేమో పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటుంటే పవనేమో చంద్రబాబునాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నారు.
సరే ఎవరికోరిక తీరుతుందనే విషయాన్ని పక్కనపెట్టేస్తే రాబోయే ఎన్నికల్లో పోటీచేయటం కోసం జోగయ్య అధినేత కోసం మూడు నియోజకవర్గాలను ఎంపికచేశారు. అవేమిటంటే తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం నియోజకవర్గాలు. పై మూడునియోజకవర్గాల్లోని పవన్ అభిమానులు, మామూలు జనాలు పవన్ ఎప్పుడు నామినేషన్ వేస్తారా ? ఎప్పుడు గెలిపించుకుందామా అని ఎదురుచూస్తున్నారట. తానుచేయించిన సర్వేల్లో కూడా జనసేన అత్యధిక నియోజకవర్గాల్లో గెలుస్తుందని తేలిందట.
ఇక్కడే జోగయ్యను పవన్ నమ్మితే ఇంతే సంగతులా అనే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఈ వృద్ధినేత అంటే 87 ఏళ్ళ జోగయ్య చేయించిన సర్వే ఎంతమాత్రం నమ్మదగ్గది కాదు. కారణం ఏమిటంటే ఈయన ఉభయగోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాల్లో మాత్రమే సర్వేచేయించారు. అందులో కూడా ప్రతి నియోజకవర్గంలోను సేకరించిన శాంపిళ్ళు 500 మాత్రమే. అందులో కూడా కాపు సామాజికవర్గం శాంపిళ్ళే ఎక్కువగా ఉన్నాయట. కాపుల్లో మెజారిటి పవన్ కు ఓట్లేస్తామని చెప్పినా మిగిలిన సామాజికవర్గాల్లోని జనాల మాటేమిటి ?
ప్రతి నియోజకవర్గంలోను 2.50 లక్షల నుండి 3 లక్షల ఓట్లవరకు ఉంటాయి. తక్కువలో తక్కువ 2.5 లక్షల ఓట్లున్న నియోజకవర్గంలో జోగయ్య సేకరించిన శాంపిళ్ళు కేవలం 500 మాత్రమే అంటే ఎంత తక్కువో అర్ధమైపోతోంది. ఇంత తక్కువ శాంపిళ్ళతో సర్వేచేసిన జోగయ్య జనసేనకు జనాలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారంటే ఎవరైనా ఎలా నమ్మాలి ? ఇలాంటి సలహాలను ఇచ్చే జోగయ్య మాటలు గనుక పవన్ వింటే జనసేన పరిస్ధితి అంగే సంగతులని జనాలే చెప్పుకుంటున్నారు. మరీ మాట పవన్ చెవిన పడిందా ?