మీ ఐబీ, రా ఏం చేస్తున్నాయ్‌.. మోదీకి వైసీపీ మంత్రి సవాల్..?

Chakravarthi Kalyan
ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య వార్ క్రమంగా ముదురుతోంది. నిన్న మొన్నటి వరకూ పరోక్షంగా తిట్టుకునేవాళ్లు ఇప్పుడు నేరుగా డైరెక్టుగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీలో ఎదగాలని బీజేపీ తాపత్రయపడుతోంది. కానీ ఆ పార్టీకి ఏమాత్రం బేస్‌ లేదు. అయినా సరే.. వివిధ పార్టీల నుంచి వలస వచ్చినా  నాయకగణం మాత్రం పుష్కలంగా ఉంది. అందుకే.. నాయకులు ఎలాగూ ఉన్నారు.. ఇక కార్యకర్తలనే తయారు చేసుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.

అందుకే ఏమాత్రం వివాదాస్పదమైన అంశాలు ఉన్నా.. వాటిని హైలెట్ చేస్తూ ప్రాచుర్యం కోసం ప్రయత్నిస్తోంది. హిందూ ఎజెండాతోనైనా కాస్త జనంలోకి వెళ్లవచ్చని ప్లాన్ చేస్తున్న ఆ పార్టీ.. మొన్న కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఆ పార్టీ నేత శ్రీకాంత్‌ రెడ్డి కారు పై జరిగిన దాడి.. ఆ తర్వాత అదే కేసులో శ్రీకాంత్‌ రెడ్డిని అరెస్టు చేయడం వంటి పరిణామాలను తనకు అనుకూలంగా వాడుకుంటోంది.

అందుకే జైల్లో ఉన్న శ్రీకాంత్‌ రెడ్డిని పరామర్శించేందుకు ఏకంగా కేంద్ర మంత్రి సైతం వచ్చేశారు. ఇప్పుడు ఈ అంశంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ... ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం బీజేపీ  దిగజారుతోందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. అసలు ఏపీని బీజేపీ ఏం చేయదలుచుకుందని మంత్రి అడుగుతున్నారు. ఏపీలో దేశ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం పెరిగిందని కేంద్ర మంత్రులు సైతం ప్రచారం చేస్తున్నారని.. మరి అదే నిజమైతే.. కేంద్రం చేతిలోని రా, ఐబీ వంటి సంస్థలు ఏం చేస్తున్నాయని మంత్రి పేర్ని నాని అంటున్నారు.

రాజకీయాల కోసం బీజేపీ నోటీకి వచ్చినట్లు మాట్లాడుతోందని... ఆ పార్టీ నేతలు రాజకీయ అవసరాల కోసం హేయంగా మాట్లాడతున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఏపీలో దేశానికి నష్టం వాటిల్లే తప్పులు జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోంది.. కేంద్రం చేతిలోని ఐబీ, రా ఏమి చేస్తున్నాయని అడిగారు. దేశం పరువును నిలబెట్టాల్సిన బీజేపీ ఇంత దిగజారడం ఏంటని మంత్రి  పేర్ని నాని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: