దేవుడా : జగన్ ను ఫాలో అయితే కేసీఆర్ హిట్టా? ఫట్టా?
కేసీఆర్ తన నిర్ణయాలను మార్చుకుంటున్నారు.భాషకు,బోధనకు సంబంధించి పిల్లలకు బోధించే సందర్భంలో తెలుగు కన్నా ఇంగ్లీషే ఎక్కువ ఉపయోగం అన్న నిర్ణయానికి వచ్చేశారు.పాఠశాలలో త్వరలో చాలా మార్పులు తీసుకురావాలని బడిలో సౌకర్యాల మెరుగుకు ఏడు వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించాలని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నారు.గుణాత్మక విద్యను అందుబాటులోకి తెచ్చి, ఇ క్లాస్ రూమ్ లకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నారు.ఈ క్రమంలో ఇందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.మరి ! మారుమూల బడుల్లో తెలుగు తప్ప మరొకటి బోధన చేయని సందర్భాల్లో పిల్లలకు ఆంగ్ల విద్య అందుబాటులోకి వస్తుందా? వచ్చినా అందరికీ అది అర్థం అవుతుందా? అన్న సందేహాలు కోకొల్లలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ వాకిట త్వరలో ఇంగ్లీషు మీడియంలో పాఠాలను బోధన చేయాలని,ఇందుకు అనుగుణంగా సర్కారీ బడులను తీర్చిదిద్దా లని కేసీఆర్ భావిస్తున్నారు.ఇప్పటికే ఆంధ్రావనిలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టి, అందుకు తగ్గ పాఠ్య పుస్తకాలను సైతం రూపకల్పన చేశారు. అయితే ప్రాథమిక విద్యను మాత్రం తెలుగు మీడియంలోనే బోధించి, ఉన్నత విద్యను మాత్రం ఇంగ్లీషు మీడియంలో బోధించాలని ఎప్పటి నుంచో భాషాభిమానులు కోరుతున్నారు.
జగన్ మాత్రం తాము పాఠశాలల్లో రెండు మాధ్యమాలనూ అందుబాటులో ఉంచుతామని అంటున్నారు. కానీ మాతృభాష బోధన అన్నది ఎంతో ముఖ్యమయిన విషయం అని దీనిని విస్మరించవద్దని అంటున్నారు భాషా వేత్తలు. ఈ వాదం వివాదం నడుస్తుండగానే తెలంగాణలోనూ ఆంధ్రా తరహాలోనే సీబీఎస్ఈ పాఠాలు బోధన చేయాలని అనుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దశల వారిగా ఇంగ్లీషు మీడియం బోధనపై దృష్టి సారించనున్నారు.