కేంద్రం చెప్పిన విధంగా జగన్ నడుచుకోరు. ఆ మాటకు వస్తే ఏ ప్రాంతీయ పార్టీ కూడా మోడీ బొమ్మను తమ పథకాలకు వాడుకోవు.ఒకవేళ కేంద్ర ప్రాయోజిత పథకాలు అయినప్పటికీ వాటి గురించి పెద్దగా పట్టించుకోవు.కొన్నిపథకాలు కేంద్రం రాష్ట్రం సంయుక్తంగా చేసినా కూడా మోడీ బొమ్మ అస్సలు ఉండనే ఉండదు.వీటితో పాటు పథకాలు వాటి తాయిలాలపై కూడా కేంద్రం ఎప్పుడూ అడ్డు చెబుతూనే ఉంటుంది. వీటిని కూడా జగన్ పట్టించుకోరు.
ఇదే సందర్భంలో బీజేపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టినా మీడియా పట్టించుకోదు.అలాంటప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అవి మీడియాకే పనికి వస్తాయి తప్ప బీజేపీ బలోపేతానికి ఎందుకూ కొరగావు. అక్కరకు రావు.అయినా కూడా కేంద్రం,వైసీపీ బంధం బలంగానే ఉంది.టీడీపీతో కన్నా వైసీపీతోనే బీజేపీ మంచి సాన్నిహిత్యంతో ఉంది. అందుకే బీజేపీ నాయకులు ఎవ్వరూ పెద్ద పెద్దగా నోరేసుకుని జగన్ పై పడిపోరు.కానీ అప్పుడప్పుడూ తిట్టాలి కనుక సోము వీర్రాజు కానీ జీవీఎల్ కానీ సీన్ లోకి వచ్చి నాలుగు మాటలు అని వెళ్లిపోవడం తప్ప పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తారు అని అనుకునేందుకు వీలే లేదు.అలాంటప్పుడు పార్టీ ఎలా బతుకుతుందని?
బీజేపీలో తరుచూ వివాదాలకు ఆనవాలుగా నిలిచే ఎంపీ జీవీఎల్ నరసింహారావు కు పదవీ యోగం దక్కనుంది.త్వరలో పొగాకు బోర్డులో ఆయనకు సభ్యత్వం ఇవ్వనున్నారు.దీంతో ఏపీ రాజకీయాల్లో మరో కుదుపు రానుంది.ఇప్పటిదాకా పాలక పక్షంను ఏదయినా తిట్టడమే అలవాటు చేసుకున్న జీవీఎల్ ఇప్పుడు ఎలా స్పందించబోతున్నారు.ఎవరికి ఆయన మేలు చేయబోతున్నారు అన్నవి ఆసక్తిదాయకంగా ఉన్నాయి.ఎందుకంటే బీజేపీ తరఫున పెద్దగా మాట్లాడేవారు రాష్ట్రంలో లేరు. జగన్ కు ఎదురు చెప్పి తగాదాల్లో ఇరుక్కున్న వారు అస్సలు లేరు.కనుక జీవీఎల్ ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తారు.. ఏవిధంగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు.. నిరసిస్తారు అన్నది ఆసక్తిదాయకం.ఏదేమయినప్పటికీ కేంద్రంతో తరుచూ తగాదాలు పెట్టుకునే వైఖరి వైసీపీలో లేదు కనుక ఎవరికి ఏ పదవి వచ్చినా రాష్ట్రం పై వాటి ప్రభావం పెద్దగా ఉండదు కనుక జగన్ కూడా జీవీఎల్ ను ఏదో ప్రత్యర్థిలా చూడరు అన్నది వాస్తవం.