మౌర్యపై అరెస్టువారెంట్.. యూపీలో బీజేపీ మార్క్ రాజకీయం
బీసీ సామాజికవర్గానికి చెందిన మౌర్య రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. మౌర్య కుమార్తె సంఘమిత్ర బదౌన్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మౌర్య ప్రభావం దాదాపు 25 నియోజకవర్గాల్లో ఉంటుందన్న అంచనాలతో బీజేపీలో కలవరం మొదలైంది. అయితే బీజేపీని వీడాలన్న తన నిర్ణయం మార్చుకునేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఆయన ఈ నెల 14న అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఇదే సమయంలో స్వామిప్రసాద్ మౌర్యపై పాత కేసులో సమన్లు రావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన రాజీనామాతో బీజేపీలో భూకంపం మొదలైనట్టేనని మౌర్య వ్యాఖ్యానించారు. 2017 ఎన్నికల్లో 312 సీట్లు గెలుచుకుని తిరుగులేని విజయం సాధించిన బీజేపీ బలం ఈ ఎన్నికలనాటికి గణనీయంగా తగ్గిపోయిందని, సమాజ్వాదీ పార్టీతో హోరాహోరీ పోరు తప్పదని ఇటీవల వచ్చిన సర్వేలు తేల్చి చెపుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు బీజేపీలో ఆందోళనను, ఇతర రాజకీయ పక్షాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.