ఒమిక్రాన్ టెర్రర్: త్వరలో దేశంలో రోజుకు 14 లక్షల కేసులు..?
అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లకూ ఈ థర్డ్ వేవ్కూ అసలు పోలికే లేదు.. మొదట్లో కేసుల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉండేది.. క్రమంగా కేసులు పెరిగేవి.. సెకండ్ వేవ్లోనూ కాస్త ఎక్కువగా కేసులు వచ్చినా అంత జోరు ఉండేది కాదు.. కానీ.. ఒమిక్రాన్ రాకతో దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు దేశంలో రోజులు లక్ష కేసులు సింపుల్గా వచ్చేస్తున్నాయి. అంతేకాదు.. త్వరలో దేశంలో రోజుకు 14 లక్షలకుపైగా కరోనా కేసులు వచ్చేస్తాయట.
ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. దేశంలో కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ చీఫ్ డాక్టర్ వి.కె.పాల్ చేసిన వ్యాఖ్యలు ఇవి.. దేశంలో సెకండ్ వేవ్ కరోనాలో రెండో దశలో రోజుకు 4 లక్షల వరకూ కేసులు నమోదయ్యాయని వి.కె.పాల్ గుర్తు చేస్తున్నారు. సెకండ్ వేవ్లో అదే గరిష్టమని.. కానీ.. ఇప్పుడు థర్డ్ వేవ్లో మాత్రం ఈ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. ఒక దశలో రోజుకు 14 లక్షల వరకూ కేసులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.
ఈ థర్డ్ వేవ్లో కరోనా కేసులు కేవలం 10 రోజుల్లోనే లక్ష కేసులకు చేరాయని వి.కె.పాల్ గుర్తు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని.. అందుకే కరోనా కట్టడి కోసం కరోనా నిబంధనలు అంతా పకడ్బందీగా పాటించాలని హెచ్చరిస్తున్నారు వి.కె.పాల్.