ఏపీలో పంట నష్టం... కేంద్రం సాయం చేసేనా...!
భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీలో రైతులు ఊహించని విధంగా నష్టపోయారు. ఇప్పటికే దాదాపు 3 వేల 300 కోట్ల రూపాయల మేర పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం ఒక్క నవంబర్ నెలలో కురిసిన వానలకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 13 లక్షల 24 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక ఈ ఏడాది జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు జరిగిన నష్టం కూడా భారీగానే ఉంది. కుండపోత వర్షాలకు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంట చివరికి పశువుల మేతకు కూడా పనికిరాకుండా పోయింది. ఇదే సమయంలో సకాలం వర్షాలు పడక కర్నూలు జిల్లాలో పంట దెబ్బతింది. అటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గులాబ్ తుఫాను కారణంగా వరితో పాటు... ఇతర వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగినట్లు నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల పైగా ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. రబీలో ప్రధాన పంట సెనక కూడా నవంబర్ నెలలో కురిసిన వర్షాలకు నానిపోయి కుళ్లిపోయింది. వరి రైతులకు ఎకరాకు దాదాపు 40 వేల వరకు పెట్టుబడి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.