హైదరాబాద్లో 'ఒమిక్రాన్'.. చుక్కలు చూపించిన అధికారులు..!
ఈ జాగ్రత్తలు మంచివే అయినా.. కొన్నిసార్లు అధికారులు అనుమానితులను బాగా ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిని అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆ మహిళ చెబుతోంది. ముందు తనకు నెగెటివ్ మీరు ఇంటికెళ్లివచ్చన్నారట.. ఆ తర్వాత గంటలోపే మీకు పాజిటివ్ వచ్చింది అన్నారట.. అంతే కాదు.. ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోవాలంటూ బెదిరించారట.
దీనికి తోడు సదరు ఒమిక్రాన్ అనుమానితురాలు మా ఆధీనం నుంచి పారిపోయి వచ్చిందని మీడియాకు సమాచారం ఇచ్చారట. ఎన్నో రోజుల తర్వాత చంటిపాపతో స్వదేశంలో అడుగుపెడితే ఇలా ఇబ్బందిపెట్టారని ఆ మహిళకు తీవ్రవేదనతో చెబుతోంది. సదరు బాధితురాలు నవంబరు 30 సాయంత్రం లండన్లో కొవిడ్ నెగెటివ్ ఆర్టీపీసీఆర్ ధ్రువపత్రం తీసుకున్న బయలు దేరారట. పరీక్షలన్నీ చేసి 4 గంటలు ఆలస్యంగా విమానం ఎక్కించారట. శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే పరీక్షల కోసం గంటల తరబడి నిలబెట్టారట. పరీక్ష ఫలితం నెగెటివ్ అని ముందు చెప్పి ఇంటి వెళ్లిపోవచ్చన్నారట. ఆ తర్వాత గంట తర్వాత పాజిటివ్ అంటూ ఇంకో మెయిల్ పంపారట. ఇంటికి రాగానే పోలీసులు వచ్చి అంబులెన్సులో టిమ్స్కి తరలించారట. అక్కడ పరీక్షల్లో మళ్లీ నెగెటివ్ వచ్చిందట. అసలు ఏంటీ పరీక్షలు.. ఏది తప్పు.. ఏది రైటు.. ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయమేనా అని ఆ బాధితురాలు ప్రశ్నిస్తోంది.